Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'రామతీర్థం' బాలాలయంలో జనవరి 28న శాస్త్రోక్తంగా విగ్రహాల ప్రతిష్టాపన...

'రామతీర్థం' బాలాలయంలో జనవరి 28న శాస్త్రోక్తంగా విగ్రహాల ప్రతిష్టాపన...

కొన్నిరోజుల క్రితం విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలోని రామతీర్థం బోడికొండపై రాముడి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన దారుణమైన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
అయితే ఇక ఈ ఆలయంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే తిరుమలలో కోదండరాముని విగ్రహాలు రూపుదిద్దుకోగా.. శనివారం అవి రామతీర్థానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో చేరుకున్నాయి. టీటీడీకి చెందిన ఎస్వీ శిల్ప కళాశాలలో స్వామివారి విగ్రహాలను తయారు చేశారు. కృష్ణ శిలతో తయారు చేసిన సీతారామ, లక్ష్మణుల విగ్రహాలను ప్రత్యేక వాహనంలో దేవదాయ ఆర్జేసీ భ్రమరాంబతో పాటు మరికొందరు అధికారులు శనివారం రామతీర్థానికి తీసుకురావటం జరిగింది.

విగ్రహాలు తీసుకువచ్చిన వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి స్వామివారి విగ్రహాలను రామతీర్థంలో తిరు వీథి గావించి ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం మంగళవాయిద్యాలతో దేవస్థానం ముఖద్వారం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. దేవస్థానంలో ధ్వజస్తంభం వద్ద విగ్రహాలను పీఠంపై నిలిపి శాస్త్రోక్తంగా అర్చకులు పూజలు నిర్వహించారు. తర్వాత భక్తులు, పోలీసుల సహకారంతో విగ్రహాలను, పీఠాన్ని యాగశాల ఎదురుగా ఉన్న గదిలోకి తరలించి భద్రపరిచారు. ఇక దేవాదాయ ఆర్జేసీ భ్రమరాంబ మాట్లాడుతూ.. జనవరి 28న శాస్త్రోక్తంగా బాలాలయంలో స్వామివార్ల విగ్రహాలను ప్రతిష్టిస్తామని తెలిపారు. అలాగే విగ్రహాలకు జనవరి 25 నుంచి అంకురార్పణ పూజలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఇక జనవరి 26, 27వ తేదీల్లో యాగశాలలో ప్రాయశ్చిత్త హోమాలు జరుగుతాయని అన్నారు. 28న కల్యాణ మండపం వద్ద బాలాలయం ఏర్పాటు చేసి అందులో విగ్రహాలను ప్రతిష్ఠించి, నిత్యపూజలు నిర్వహిస్తారని చెప్పారు. నీలాచలంపై కోదండ రామాలయం అభివృద్ధి పనులు పూర్తయ్యాక అక్కడ విగ్రహాలను పునః ప్రతిష్టింపజేస్తామని అన్నారు. అప్పటివరకు బాలాలయంలోనే స్వామివారికి నిత్యపూజలు కొనసాగుతాయని దేవాదాయ ఆర్జేసీ భ్రమరాంబ చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald