Dailyhunt
అది ఎన్‌కౌంటర్.. ఇది ఆత్మహత్య.. 'న్యాయం' జరిగినట్టేనా.?

అది ఎన్‌కౌంటర్.. ఇది ఆత్మహత్య.. 'న్యాయం' జరిగినట్టేనా.?

TeluguBulletin.com 4 years ago

దిశ ఘటనలో నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.. చిన్నారి చైత్ర హత్యాచార ఘటనలో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఎలాగైతేనేం, అక్కడా..

ఇక్కడా న్యాయం జరిగిందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన నిందితులు, ఆమెను చంపేసి.. కాల్చేశారు. ఇక, చిన్నారి చైత్రపై అత్యాచారం జరిపిన మృగాడు, ఆమెను చంపేసి పారిపోయి.. ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, రైలు పట్టాల మీద శవమై తేలిన ఆ మృగాడు రాజు.. ఆత్మహత్య చేసుకున్నాడా.? లేదా, ఇంకేమైనా జరిగిందా.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది.

ఒక్కటి మాత్రం నిజం.. నేరం జరిగితే.. ఆ నేరానికి పాల్పడినవారికి శిక్ష పడి తీరాల్సిందే. చట్టాల్లోని లొసుగుల్ని నేరాలకు పాల్పడినవారు ఎలా వాడుకుంటున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలాంటోళ్ళు, రాజకీయ వ్యవస్థల్ని శాసించే స్థాయికి ఎదుగుతున్నారు.. కీలక పదవులూ చేపడుతున్నారు. దాంతో, చట్టాల అమలు.. అనేది హాస్యాస్పదంగా మారిపోయింది.. ఇది ఇప్పుడు కొత్తగా నడుస్తున్న చరిత్ర కాదు.. ఎప్పటినుంచో జరుగుతున్నదే. దేశంలో తీవ్రమైన నేరాలకు పాల్పడి, న్యాయస్థానాల ద్వారా దోషులుగా తేలినవారికి శిక్షల్ని అమలు చేయడం ఓ ప్రసహనంగా మారిపోయింది.

దోషులు తప్పించుకున్నా ఫర్లేదు.. నిర్దోషులకు శిక్ష పడకూడదన్న కోణంలో.. కల్పిస్తున్న కొన్ని అవకాశాలు.. చాలామంది దోషులకు ఉపయోగపడుతున్నాయి.. అతి కొద్ది మంది నిర్దోషులకు మాత్రమే ఆ అవకాశాలు ఉపయోగపడుతున్నాయి. కొత్త చట్టాలు అవసరం లేదు.. వున్న చట్టాల్ని సరిగ్గా అమలు చేస్తే.. దోషులకు సకాలంలో శిక్ష విధించగలిగితే.. ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట పడుతుంది.

దిశ ఘటన తర్వాత చాలా ఘటనలు తెలంగాణలో జరిగాయి.. వాటిల్లో చైత్ర ఘటన ఇంకోటి. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగినా.. చైత్ర ఘటనలో నిందితుడు పోలీసులకు భయపడి ప్రాణాలు తీసుకున్నా.. ఈ ఘటన పట్ల సమాజంలో నెలకొన్న అసహనం కొంతమేర చల్లారుతుందేమోగానీ.. న్యాయం జరిగినట్టు కాదు. మత్తు మందుల వాడకం, మద్యం సేవించడం, ఇంటర్నెట్ అశ్లీలం.. ఇలాంటివాటన్నిటిపైనా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించకపోతే.. నిర్భయ, దిశ.. లాంటి ఘటనలు జరుగుతూనే వుంటాయ్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin