ఆంధ్రప్రదేశ్లో అమరావతి గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. 16-05-2026న ఒక తెలుగు పత్రికలో ప్రచురితమైన కథనంలో వచ్చిన అంశాలపై ఒక్కొక్కటిగా ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.
గన్నవరం కోసం ఖర్చైన వేల కోట్లు వృథా అవుతున్నాయా?
ఈ ఆరోపణ పూర్తిగా తప్పుదారి పట్టించేదని ప్రభుత్వం పేర్కొంది. గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం కాకుండా భారత విమానాశ్రయాల అథారిటీ (AAI) నిర్వహిస్తోందని తెలిపింది.
ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం..
- కొత్త టెర్మినల్ భవనం సుమారు రూ.162 కోట్లతో నిర్మించారు.
- రన్వే విస్తరణకు దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేశారు.
- ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ (ITB) ప్రాజెక్టు విలువ రూ.611 కోట్లు.
- 2026 మార్చి నాటికి దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి.
- కొత్త ఏప్రాన్, బ్యాగేజీ హ్యాండ్లింగ్ సిస్టమ్, ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జ్లు, కార్ పార్కింగ్, కొత్త ATC టవర్ వంటి మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతున్నాయి.
అందువల్ల "గన్నవరం ప్రాజెక్టు నిలిచిపోయింది", "రూ.4,000 కోట్లు వృథా అయ్యాయి" వంటి ప్రచారాలకు వాస్తవ ఆధారాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అమరావతి విమానాశ్రయానికి ఇప్పటికే ఆమోదం వచ్చిందా?
ఇది కూడా వాస్తవాలకు విరుద్ధమైన ప్రచారమేనని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం అమరావతి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కేవలం ప్రాథమిక అధ్యయన దశలో మాత్రమే ఉందని పేర్కొంది.
ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉందని వెల్లడించింది:
- ప్రీ-ఫీజిబిలిటీ, TEFR అధ్యయనాలు మాత్రమే జరుగుతున్నాయి.
- Site Clearance ఇంకా రాలేదు.
- కేంద్ర ప్రభుత్వ In-Principle Approval లభించలేదు.
- రక్షణ శాఖ NOC పెండింగ్లో ఉంది.
- పర్యావరణ అనుమతుల ప్రక్రియ ప్రారంభం కాలేదు.
- భూసేకరణ మొదలు కాలేదు.
- PPP లేదా కాంట్రాక్టు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.
కాబట్టి "రూ.3,409 కోట్ల ప్రాజెక్టు ఇప్పటికే ఖరారైంది" అనే ప్రచారం కేవలం ఊహాగానమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
4,618 ఎకరాల భూసేకరణ అవసరమా?
ఈ అంశంపైనా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. భవిష్యత్ విస్తరణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద విమానాశ్రయాలకు ఎక్కువ భూభాగం కేటాయించడం సాధారణ విషయమేనని తెలిపింది.
ఉదాహరణగా..
- హైదరాబాద్ షంషాబాద్ విమానాశ్రయం - సుమారు 5,500 ఎకరాలు
- జేవర్ (నోయిడా) విమానాశ్రయం - సుమారు 6,200 ఎకరాలు
- ఢిల్లీ IGI విమానాశ్రయం - సుమారు 5,100 ఎకరాలు
అలాగే "లండన్ హీత్రో కేవలం 1,670 ఎకరాల్లోనే నడుస్తోంది" అనే పోలిక సరైనది కాదని ప్రభుత్వం పేర్కొంది. లండన్ నగరానికి మొత్తం ఆరు విమానాశ్రయాలు సేవలు అందిస్తున్నాయని గుర్తు చేసింది.
అమరావతి ఎయిర్పోర్ట్ వస్తే గన్నవరం మూసేస్తారా?
ఈ ప్రచారాన్నీ ప్రభుత్వం ఖండించింది. ఇప్పటివరకు అలాంటి నిర్ణయం ఎక్కడా తీసుకోలేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం అమరావతి ప్రాజెక్టుకు Site Clearance కూడా రాలేదని తెలిపింది. ప్రైవేట్ కన్సెషన్ ఒప్పందాలు కూడా లేవని వివరించింది. భవిష్యత్తులో ఏ విమానాశ్రయం కొనసాగాలి అనే అంశాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ (MoCA) నిర్ణయిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టేనా?
ఈ ఆరోపణలపై కూడా ప్రభుత్వం స్పందించింది. అమరావతి రాష్ట్ర రాజధాని కావడంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయ ప్రణాళిక రూపొందించడం సహజమేనని పేర్కొంది.
ప్రస్తుతం ట్రాఫిక్, సాధ్యత, భూసరళి వంటి అంశాలపై మాత్రమే అధ్యయనం జరుగుతోందని తెలిపింది. ఇప్పటివరకు అమరావతి విమానాశ్రయ ప్రాజెక్టుకు ప్రజాధనం కేటాయించలేదని కూడా స్పష్టం చేసింది.
ప్రభుత్వ తుది వివరణ ఇదే:
మొత్తంగా ప్రభుత్వం చెప్పినదేమిటంటే..
- గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి పనులు యథావిధిగా కొనసాగుతున్నాయి.
- అమరావతి విమానాశ్రయం ఇంకా ప్రారంభ అధ్యయన దశలోనే ఉంది.
- "వేల కోట్ల వృథా", "గన్నవరం మూసివేత" వంటి ప్రచారాలకు వాస్తవాధారాలు లేవు.

