కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ 'చిరంజీవి' నుంచి స్నీక్ పీక్ విడుదలైంది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లలో విడుదల కానుంది.
కికు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు.
'చిరంజీవి' కథలో డెక్స్ట్రోకార్డియా అనే అరుదైన పరిస్థితిని కీలక అంశంగా తీసుకున్నారు. సాధారణంగా గుండె ఎడమవైపు ఉండగా, డెక్స్ట్రోకార్డియా ఉన్న వ్యక్తుల్లో గుండె కుడివైపు ఉంటుంది. సినిమాలో చిరంజీవి అనే యువకుడు ఇదే పరిస్థితితో జీవిస్తుంటాడు. అతడిని కశిష్ ఖాన్ పోషించిన పాత్ర ఎంతో ప్రేమిస్తుంది.
తాజాగా విడుదల చేసిన స్నీక్ పీక్లో హీరో, హీరోయిన్ మధ్య సన్నివేశాన్ని చూపిస్తూ కథలోని కీలక మలుపుపై ఆసక్తి పెంచారు. చిరంజీవికి గుండె కుడివైపు ఉంటుందని తెలిసిన హీరోయిన్, ఓ సందర్భంలో అతడి గుండె లయను ఎడమవైపు గమనించి ఆశ్చర్యపోతుంది. అసలు అక్కడ ఏం జరిగింది? చిరంజీవి విషయంలో దాగి ఉన్న రహస్యం ఏమిటి? అనే ప్రశ్నలను ఈ సన్నివేశం ముందుకు తీసుకొస్తోంది.
స్నీక్ పీక్ చివర్లో హీరో పాత్రను గ్రే షేడ్లో చూపించడం మరో ఆసక్తికర అంశంగా నిలిచింది. ఇప్పటివరకు కనిపించిన చిరంజీవి పాత్రకు మరో కోణం ఉందనే సంకేతాన్ని మేకర్స్ ఇచ్చారు. డెక్స్ట్రోకార్డియా నేపథ్యాన్ని సర్వైవల్ డ్రామా, థ్రిల్లర్ అంశాలతో ఎలా ముడిపెట్టారనేది సినిమాలో కీలకం కానుంది.
ఈ చిత్రంలో ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రామకృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్గా, యష్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. గోవింద్, శుభ సాయి వెంకట్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. స్క్రిప్ట్, దర్శకత్వ బాధ్యతలను శుభ సాయి వెంకట్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 28న 'చిరంజీవి' ప్రేక్షకుల ముందుకు రానుంది.

