దక్షిణ కొరియాలోని బుసాన్లో పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, ప్రముఖ హ్వాసంగ్ గ్రూప్ (Hwaseung Group) ఉన్నతస్థాయి ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఫుట్వేర్, ఫుట్వేర్ మెటీరియల్స్, ఆటోమోటివ్ కాంపొనెంట్స్, ఓడీఎం స్పోర్ట్స్ ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన హ్వాసంగ్ గ్రూప్ను ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, కుప్పంలో హ్వాసంగ్ ఫుట్వేర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. అదే ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ ఫుట్వేర్ కాంపొనెంట్ అండ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో దిగుమతులపై ఆధారపడటం తగ్గడమే కాకుండా, సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వివరించారు.
ప్రీమియం గ్లోబల్ బ్రాండ్ల కోసం పెర్ఫార్మెన్స్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత కస్టమైజేషన్, సస్టైనబుల్ మెటీరియల్స్పై పరిశోధనలు జరిగే నెక్స్ట్ జనరేషన్ అథ్లెటిక్ ఫుట్వేర్ ఆర్ అండ్ డీ, ఆసియా-పసిఫిక్ ఇన్నోవేషన్ సెంటర్ను కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని లోకేష్ సూచించారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సేవలందించేలా కుప్పంలో ప్రధాన కేంద్రం, తిరుపతిలో విడిభాగాల తయారీ కేంద్రం, విశాఖపట్నంలో డిజైన్, కార్పొరేట్, లాజిస్టిక్స్ విభాగాలతో కూడిన సమగ్ర దక్షిణ భారత తయారీ క్లస్టర్ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.
హ్వాసంగ్ ఫుట్వేర్కు చెందిన టైర్-1, టైర్-2 విక్రేతలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక సప్లయర్ మీట్ నిర్వహించాలని కూడా మంత్రి లోకేష్ కోరారు. దీంతో రాష్ట్రంలో ఫుట్వేర్ తయారీ రంగానికి మరింత ఊతం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
హ్వాసంగ్ కార్పొరేషన్ అఫిలియేటెడ్ బిజినెస్ సీఈవో హెయో సియోంగ్-రియోంగ్ మాట్లాడుతూ, కుప్పంలో రూ.900 కోట్ల పెట్టుబడితో గ్రీన్ఫీల్డ్ నాన్-లెదర్ ఫుట్వేర్ తయారీ ప్లాంట్ను ఇప్పటికే ప్రకటించినట్లు తెలిపారు. అడిడాస్ సహా పలు అంతర్జాతీయ బ్రాండ్లకు ఓఈఎం సరఫరాదారుగా ఉన్న ఈ ప్లాంట్ ద్వారా ఏటా 2 కోట్ల జతల స్పోర్ట్స్ షూలను తయారు చేసే సామర్థ్యం ఉంటుందని చెప్పారు. ప్రారంభ దశలో ఎగుమతులపై దృష్టి సారించి, అనంతరం దేశీయ మార్కెట్కు కూడా ఉత్పత్తులు అందించే ప్రణాళిక ఉందని వెల్లడించారు.
హ్వాసంగ్ ఆటోమోటివ్ విభాగం ఇప్పటికే పూణే, చెన్నై, అనంతపురం జిల్లా గూడపల్లిలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తాజా ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హ్వాసంగ్ గ్రూప్కు చెందిన వివిధ వ్యాపార విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

