Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు.
అయితే.. కొందరు తన పేరు వాడుకుని విరాళాలు సేకరిస్తూ పుట్టినరోజు వేడుకలు చేస్తున్నట్టు ఎన్టీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఆఫీస్ స్పందించింది.
'మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమాన సంఘం' పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలతో ఎన్టీఆర్ కు సంబంధంలేదు. కొన్ని అభిమాన సంఘాలు ఎన్టీఆర్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందుకు విరాళాలు కావాలని సేకరిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఎవరూ ఆ వార్తలు నమ్మి, విరాళాలు ఇవ్వవద్దు. ఎటువంటి కార్యక్రమ వివరాలైనా ఎన్టీఆర్ నిర్వహించే క్రమంలో ఆయనే స్వయంగా వివరాలు వెల్లడిస్తారు. ఎటువంటి మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దు. ఎటువంటి నగదు విరాళాల రూపంలో ఇవ్వొద్ద'ని ఓ ప్రకటనను విడుదల చేసింది.
జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరుతో రాబోయే రోజుల్లో రూ.100 కోట్లు విరాళంగా సేకరించి, వాటితో సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. దీనిపైనే ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ఎన్టీఆర్ పాపులారిటీని ఉపయోగించుకుని కొందరు స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఏం మోసముందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వారిపట్ట జాగ్రత్తగా ఉండాలని కూడా ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

