Karuppu: తమిళ హీరో సూర్య నటించిన సినిమా కరుప్పు. తెలుగులో వీరభద్రుడుగా విడుదలైంది. ఇటివల విడుదలైన సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. సూర్య కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబడుతున్న సినిమాగా దూసుకెళ్తోంది.
త్రిష హీరోయిన్ గా నటించిన సినిమాకు ఆర్ జే బాలాజీ దర్శకత్వం వహించారు. అయితే.. సినిమాలోని ఓ డైలాగ్ పై ఇప్పుడు వివాదం నెలకొంది. సంగీత దర్శకుడు ఇళయరాజాను ఉద్దేశిస్తున్న ఓ డైలాగ్ ను టీమ్ తొలగించింది. దీనిపై వివరణ ఇస్తూ.. ఇళయరాజాను కించపరచాలనేది తమ ఉద్దేశంకాదని ఓ ప్రకటన విడుదల చేసింది.
'కరుప్పులోని ఓ డైలాగ్ పై ఇళయరాజా బాధపడ్డారని మా దృష్టికి వచ్చింది. ఆ డైలాగ్ కావాలని పెట్టింది కాదు. కానీ, ఆయన బాధను అర్ధం చేసుకుంటున్నాం. ఆ డైలాగ్ ను తొలగిస్తున్నాం. సినీ పరిశ్రమకు ఇళయరాజా ఎంతో సేవ చేశారు. అటువంటి సంగీతజ్ఞానిని అవమానించడం మా ఉద్దేశం కాదు. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించము. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయనను ఉద్దేశించి ఉన్న డైలాగులు నేటి నుంచి సినిమా ప్రదర్శనలో ఉండవు. వాటిని తొలగిస్తున్నాం. ఆయనను ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉంటామ'ని ప్రకటనలో పేర్కొంది.
సినిమా తమిళ వెర్షన్ లోని సెకండాఫ్ లో విజయ్ కాంత్ కు సంబంధించిన సన్నివేశంలో పాటలకు హక్కులపై డైలాగులు ఉండటమే వివాదానికి కారణమైంది. ఈ డైలాగులు ఇళయరాజాను విమర్శిస్తున్నట్టే ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి. దీంతో ఇళయరాజాకు క్షమాపణలు చెప్తూ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది.

