కువైట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి చెందిన భాగ్యవతి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం స్పందించింది.
మీడియా కథనాలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన సెల్ఫీ వీడియో ఆధారంగా ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే చర్యలు ప్రారంభించింది. బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని సీఎం N. Chandrababu Naidu అధికారులను ఆదేశించారు.
ఉపాధి కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో కువైట్కు వెళ్లిన భాగ్యవతి అక్కడ గృహ సహాయకురాలిగా పనిచేస్తున్నట్టు తెలిసింది. అయితే ఉద్యోగానికి సంబంధించిన సరైన వీసా సౌకర్యం కల్పించకుండా ఏజెంట్లు నిర్లక్ష్యం చేసినట్టు సమాచారం. దీంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కుటుంబ సభ్యులకు తెలిపింది. తనపై శారీరక, మానసిక వేధింపులు జరుగుతున్నాయని, స్వదేశానికి రావాలని కోరితే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని భాగ్యవతి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ఎన్ఆర్టీ అధికారులను అప్రమత్తం చేసింది. వెంటనే కువైట్లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి, బాధితురాలి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఆమెను త్వరగా భారత్కు తీసుకురావడానికి చర్యలు ప్రారంభించింది. ఇదే సమయంలో సంబంధిత ఏజెంట్ల పాత్రపై కూడా విచారణ చేపట్టాలని, అవసరమైతే కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించినట్టు తెలిసింది.
తిరుపతి జిల్లా అధికారులు, చంద్రగిరి పోలీసులు కూడా భాగ్యవతి కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. బాధితురాలు సురక్షితంగా తిరిగి వచ్చే వరకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని అధికార వర్గాలు భరోసా ఇచ్చాయి.

