"అక్కడ ఉన్నది ఎవరు… మన పవన్ కళ్యాణ్!" అని ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు గుంతలతో నిండిన రహదారులు, వర్షాకాలంలో ప్రయాణానికి ఇబ్బందులు, గ్రామాలకు సరైన అనుసంధానం లేక ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు క్రమంగా గతంగా మారుతున్నాయి.
కొత్త రహదారులు, వంతెనలు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధితో పిఠాపురం రూపురేఖలు మారిపోతుండటంతో, "మాది పిఠాపురం తాలూకా… మాది డిప్యూటీ సీఎం తాలూకా" అని స్థానికులు గర్వంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది.
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన హామీకి అనుగుణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే పనులను ముందుకు తీసుకెళ్తున్నారు.
నియోజకవర్గవ్యాప్తంగా రూ.207 కోట్లతో 307 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల నిర్మాణ ప్రణాళిక అమలవుతోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు-భవనాల శాఖ తదితర విభాగాల నిధులతో చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటికే రూ.100 కోట్లతో 611 రోడ్లు పూర్తయ్యాయి. సుమారు 152 కిలోమీటర్ల మేర కొత్త రహదారులు అందుబాటులోకి రాగా, మరో 70కి పైగా రోడ్లు, వంతెనల పనులు పురోగతిలో ఉన్నాయి.
ప్రజలు కోరిన ప్రతి రహదారిని సాధ్యమైనంత త్వరగా మంజూరు చేస్తూ పాఠశాలలు, దేవాలయాలు, ఆసుపత్రులు, వ్యవసాయ భూములు, మత్స్యకార గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడింది.
ఉప్పాడ తీర ప్రాంతంలోని మత్స్యకార కాలనీల్లో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు పూర్తయ్యాయి. కొత్త మాయాపట్నం పునరావాస కాలనీలో రూ.1.52 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మించగా, కొత్తసూరాడపేట కాలనీలో రూ.93 లక్షలతో కొత్త రహదారులు నిర్మించి ప్రధాన రహదారికి అనుసంధానం చేశారు. దీంతో మత్స్యకార కుటుంబాల దైనందిన జీవనం మరింత సౌకర్యవంతమైంది.
తుపాన్లతో దెబ్బతిన్న అమరవిల్లి-రామన్నపాలెం బీచ్ రహదారిని రూ.88 లక్షలతో పునర్నిర్మించారు. అలాగే ముమ్మడివారిపాడు గ్రామానికి శాశ్వత రహదారి నిర్మించి అభివృద్ధికి కొత్త దారి తీశారు. ఏడు సంవత్సరాలుగా దెబ్బతిన్న కొండెవరం-పిఠాపురం-ఉప్పాడ రహదారిని రూ.1.22 కోట్లతో పునర్నిర్మించడంతో సుమారు 8 వేల మంది ప్రజల ప్రయాణ కష్టాలు తొలగాయి.
గొల్లప్రోలు మండలం వెన్నెపూడి, తాటిపర్తి, కొడవలి, చిత్రాడ తదితర గ్రామాల్లో కొత్త రోడ్లు, సీసీ రహదారులు, డ్రైనేజీలు నిర్మించి గ్రామీణ మౌలిక వసతులను బలోపేతం చేశారు. చిత్రాడలో పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు.
'పల్లెపండుగ 2.0' కార్యక్రమంలో రైతులకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ పంట పొలాల మధ్య డొంక రోడ్లు నిర్మించారు. పి.రాయవరం, బి.ప్రత్తిపాడు ప్రాంతాల్లో నిర్మించిన గ్రావెల్ రోడ్లతో వందల ఎకరాల వ్యవసాయ భూములకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. రైతులు తమ పంటలను సులభంగా మార్కెట్కు తరలించే అవకాశం ఏర్పడింది.
ఈ అభివృద్ధి ప్రభావం ఇప్పుడు రోడ్లకే పరిమితం కాలేదు. ప్రజల్లోనూ ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. "మాది పిఠాపురం… మాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం" అని స్థానికులు గర్వంగా చెప్పుకోవడం కనిపిస్తోంది. అభివృద్ధి కళ్లముందు కనిపిస్తే ప్రజల్లో కలిగే విశ్వాసానికి ఇది నిదర్శనంగా మారిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెండింగ్లో ఉన్న రహదారి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి పనిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు.
రోడ్లు, మౌలిక సదుపాయాలు, గ్రామీణ అనుసంధానం, రైతులు, మత్స్యకారులు, విద్యార్థులు, సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పిఠాపురం నియోజకవర్గం క్రమంగా ఒక ఆదర్శ అభివృద్ధి నమూనాగా రూపుదిద్దుకుంటోంది.

