విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొని బిజీగా గడిపారు. ఉదయం కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం తిరుప్పావడ సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి చేరుకున్న మంత్రి లోకేష్కు మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, షాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ సుగుణమ్మ, తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం తిరుమలలోని కర్ణాటక భవన్లో జరిగిన టీటీడీ బోర్డు సభ్యుడు జి. భానుప్రకాష్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు మంత్రి లోకేష్ హాజరయ్యారు. నూతన వధూవరులు డా. వైష్ణవి, డా. హర్షవర్థన్ రెడ్డిలను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందజేసి వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
తర్వాత తిరుపతిలోని భూపాల్ హౌసింగ్లో టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కే. గౌతమి శ్వేత నివాసాన్ని మంత్రి లోకేష్ సందర్శించారు. ఏపీ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేతలను ఆశీర్వదించారు. మంత్రి లోకేష్ సమక్షంలో వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. గురువారం రాత్రి తిరుమలలోని శ్రీ శృంగేరీ శారద పీఠంలో నాదెండ్ల బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేతల వివాహం జరగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

