ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ను మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ప్రముఖ శాస్త్రీయ గాయని పద్మశ్రీ శోభారాజు మర్యాదపూర్వకంగా వేర్వేరుగా కలిశారు.
ఈ రెండు భేటీల్లో విద్య, నైతిక విలువలు, తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణ వంటి అంశాలపై చర్చ జరిగింది.
చాగంటి కోటేశ్వరరావుతో జరిగిన సమావేశంలో విద్యార్థులను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో నైతిక విలువలతో కూడిన విద్య ప్రాధాన్యతను ఆయన మంత్రి లోకేష్కు వివరించారు. చిన్ననాటి నుంచే పిల్లల్లో మానవీయ విలువలు, క్రమశిక్షణ, నైతికతను పెంపొందించే విద్య అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 'నో బ్యాగ్ డే' సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మార్గదర్శకత్వంలో రూపొందించిన నైతిక విలువల పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. సమగ్ర విద్యా వికాసానికి నైతిక విలువల విద్య ఎంతో అవసరమనే భావనతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. సమావేశం అనంతరం మంత్రి నారా లోకేష్ స్వయంగా బయటకు వచ్చి చాగంటి కోటేశ్వరరావును వినయపూర్వకంగా సాగనంపారు.
అనంతరం ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, అన్నమాచార్య సంకీర్తనల ప్రచారకురాలు పద్మశ్రీ శోభారాజు కూడా మంత్రి నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శోభారాజు అన్నమాచార్యుల చిత్రపటాన్ని మంత్రికి బహుకరించగా, మంత్రి లోకేష్ ఆమెకు శ్రీవారి ప్రతిమను అందించి సత్కరించారు. తెలుగు సంస్కృతి, సనాతన ధర్మం, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణతో పాటు అన్నమయ్య సంకీర్తనలను భావితరాలకు చేరవేయడంలో శోభారాజు చేస్తున్న విశిష్ట సేవలను మంత్రి అభినందించారు.


