శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో మంగళవారం ఆసక్తికర దృశ్యం కనిపించింది. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఓ మత్స్యకార కుటుంబం ఇంటికి వెళ్లి వారితో కలిసి సాధారణ వ్యక్తిలా కింద కూర్చుని భోజనం చేశారు.
అదే సమయంలో ఆయన ఎదుట కుర్చీలో బిడ్డను ఎత్తుకుని కూర్చున్న ఓ మహిళ కనిపించిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. అధికారంలో ఉన్న నాయకుడు, సామాన్య కుటుంబంతో కలిసిపోయిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు 'మత్స్యకారుల సేవలో' కార్యక్రమం కోసం కావలి నియోజకవర్గంలో పర్యటించారు. తుమ్మలపెంటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక చేపల మార్కెట్ను సందర్శించారు. అక్కడ మహిళా వ్యాపారుల నుంచి స్వయంగా చేపలు కొనుగోలు చేసి మత్స్యకారులతో ముచ్చటించారు. వారి జీవనోపాధి, చేపల వేట పరిస్థితులు, మార్కెట్లో అమ్మకాల పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారుడు తానంగారి బాబు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని తమ ఇంటికి ఆహ్వానించారు. ఆహ్వానం స్వీకరించిన సీఎం మార్కెట్లో కొనుగోలు చేసిన చేపలతో వారి ఇంటికి వెళ్లారు. తానంగారి బాబు సతీమణి వెంకమ్మ స్వయంగా చేపల పులుసు వండగా, సీఎం అక్కడే ఉండి వంట చేసే విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. సరదాగా కొద్దిసేపు గరిటె కూడా తిప్పారు.
ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన కుటుంబంలోని యువతితో మాట్లాడి తల్లీబిడ్డ ఆరోగ్యం గురించి సీఎం ఆరా తీశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నేల మీద కూర్చుని భోజనం చేశారు. ఈ సమయంలో ఆయన ఎదుట బిడ్డను ఎత్తుకుని కుర్చీలో కూర్చున్న మహిళ కనిపించిన దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజలతో కలిసిపోయే నాయకత్వానికి ఇది ఉదాహరణ అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
భోజనం సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా చేపల పులుసు వడ్డించడం కూడా అక్కడి వారిని ఆకట్టుకుంది. తమ ఇంటికి సీఎం రావడం జీవితాంతం మరిచిపోలేమని తానంగారి బాబు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
'మత్స్యకారుల సేవలో' పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతోందని మత్స్యకారులు సీఎంకు తెలిపారు. ఈ పథకం కింద మత్స్యకార కుటుంబాలకు ప్రతి ఏడాది రూ.20 వేల ఆర్థిక భరోసా అందిస్తున్న విషయం తెలిసిందే.

