Pradeep Singh Rawat: ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ముంబైలోని ఆయన నివాసంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు.
ఆయన స్వస్థలం ఢిల్లీ. అనేక తెలుగు సినిమాల్లో ఆయన నటించారు. తెలుగుతోపాటు వివిధ భాషల సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. హిందీలో తెరకెక్కిన 'బాఘీ' ఆయన మొదటి సినిమా. 2001లో వచ్చిన అమీర్ ఖాన్ 'లగాన్' సినిమాలోనూ ఆయన నటించారు.
నితిన్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన 'సై' సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేశారు. ఆపై ఛత్రపతి, గజిని, లక్ష్మీ, స్టాలిన్, అందరివాడు, భద్ర, దేశముదురు, యోగి, నాయక్.. తదితర సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవికి స్నేహితుడిగా నటించారు. కెరీర్ ప్రారంభంలో టెలివిజన్ ధారావాహికల్లో కూడా నటించారు. బీ.ఆర్.చోప్రా తెరకెక్కించిన ప్రసిద్ధ సీరియల్ 'మహాభారత్'లో అశ్వత్థామ పాత్రలో నటించారు. ఆయన మృతితో టాలీవుడ్ లో విషాదం అలముకుంది.

