హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద గత రెండు రోజులుగా నిరాహార దీక్ష నిర్వహిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కార్మికులు, గుత్తేదారుల అసోసియేషన్ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.
కార్మిక సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేయడంతో కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ధర్నా ప్రదేశానికి చేరుకుని కార్మికులను పరామర్శించారు.

ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న ప్రేమ్ కుమార్, వారి న్యాయపరమైన డిమాండ్లకు పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న 31 రూపాయల రేటును 51 రూపాయలకు పెంచాలని, కార్మికుల కుటుంబ భద్రత కోసం అమల్లో ఉన్న 10 లక్షల ఇన్సూరెన్స్ను 20 లక్షలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మిక సంక్షేమానికి అవసరమైన ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
సమాజ నిర్మాణంలో సెంట్రింగ్ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్న ప్రేమ్ కుమార్, వారి కష్టాలను ప్రభుత్వం గుర్తించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని అన్నారు. శ్రమజీవుల సంక్షేమం కోసం జనసేన పార్టీ అధినేత Pawan Kalyanతో పాటు తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాకుమాను లక్ష్మణ్ రావు, కొల్లా శంకర్, బోగాది వెంకటేశ్వరావు, వేముల మహేష్, పోలెబోయిన శ్రీనివాస్, మాధవ్ రావు, బడే విశ్వేశ్వర్ రావు, చిట్టిబాబు, జనసైనికులు మరియు కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

