తెలుగు సినీ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాకవి Sirivennela Seetharama Sastry జ్ఞాపకార్థంగా అనకాపల్లిలో నిర్మించనున్న 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన జరిగింది.
అనకాపల్లి గాంధీనగర్లో రూ.39.70 లక్షల జీ.వీ.ఎం.సీ నిధులతో నిర్మించనున్న ఈ స్మృతివనానికి రాష్ట్ర శాసనమండలి సభ్యుడు Konidela Nagendra Rao బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎమ్మెల్యే Konathala Ramakrishna ఆధ్వర్యం వహించారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి 71వ జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నాగబాబు భావోద్వేగంగా మాట్లాడారు. సిరివెన్నెల గారిని ప్రతిసారి "అన్నయ్య" అని పిలిచేవాడినని, ఆయన కూడా ఎంతో ఆప్యాయంగా "తమ్ముడు" అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన చిన్ననాటి జ్ఞాపకాలతో ముడిపడిన ప్రాంతంలో తన చేతుల మీదుగా స్మృతివనానికి శంకుస్థాపన చేయడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా ఉందన్నారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆస్తుల కంటే ఆత్మీయులను ఎక్కువగా సంపాదించుకున్న మహానుభావుడని నాగబాబు పేర్కొన్నారు. ఇతరులకు సహాయం చేయడమే తెలిసిన ఆయనకు, ఎవరి దగ్గరా సహాయం అడగడం తెలియదన్నారు. కుల, మత భేదాలకు అతీతంగా జీవించిన ఆయన ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలిచారని, తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని గుప్తదానాల రూపంలో అందించారని చెప్పారు.
'రుద్రవీణ' సినిమా సమయంలో దర్శకుడు K. Balachander తో జరిగిన సందర్భాలను నాగబాబు గుర్తు చేసుకున్నారు. "నేను సైతం" అనే భావాన్ని గొప్ప గీతంగా మలిచిన అద్భుత రచయిత సిరివెన్నెల అని కొనియాడారు. అలాగే "ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమిని" వంటి పాటలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు.

అన్నయ్య Chiranjeevi, Pawan Kalyan, వరుణ్ తేజ్లను సిరివెన్నెల ఎంతో ప్రేమగా చూసుకునేవారని నాగబాబు తెలిపారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను చూసి "మీరు ప్రజల కోసం పుట్టారు.. ప్రజలు మీకు పట్టం కట్టే రోజు వస్తుంది" అని చెప్పేవారని వెల్లడించారు. ఈ రోజు ఆయన బతికి ఉంటే పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చూసి ఎంతో ఆనందించేవారని అన్నారు.
ఈ సందర్భంగా గేయరచయిత Bhaskarabhatla Ravi Kumar కు సిరివెన్నెల స్మారక పురస్కారం అందజేశారు. అనంతరం మాట్లాడిన కొణతాల రామకృష్ణ, సిరివెన్నెల గారు అనకాపల్లి ప్రాంతానికి చెందినవారని చెప్పుకోవడం గర్వంగా ఉందని, భవిష్యత్తులో ఆయన పేరుతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

