రానున్న పురపాలక, నగరపాలక సంస్థలు మరియు నగర పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు జనసేన పార్టీ ప్రత్యేక కమిటీ గురువారం విజయవాడలో సమావేశమైంది.
జనసేన పార్టీ పి.ఏ.సీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి Nadendla Manohar అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేయాలని భావించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు, ప్రకాశం-నెల్లూరు-రాయలసీమ ప్రాంతాలకు వేర్వేరు కమిటీలు పర్యటించి, ఆయా ప్రాంతాల్లో పెరగనున్న వార్డులు, డివిజన్లు, స్థానిక రాజకీయ పరిస్థితులపై అధ్యయనం నిర్వహించాయి.
ఈ పర్యటనల్లో భాగంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులతో కమిటీ సభ్యులు సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. ప్రాంతాలవారీగా సిద్ధం చేసిన నివేదికలను సమావేశంలో నాదెండ్ల మనోహర్కు అందజేశారు. కూటమి స్ఫూర్తిని కొనసాగిస్తూ స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సమన్వయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, కమిటీ సభ్యులు సమర్పించిన నివేదికలను త్వరలోనే పవన్ కళ్యాణ్కు నివేదించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్ బాబు, వంశీకృష్ణ, పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, కొటికలపూడి గోవిందరావు, సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, టి.సి. వరుణ్, ఆరణి మదన్, పిడుగు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

