Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తప్పు వ్యాఖ్యల తర్వాత నాగేశ్వర్ టార్గెట్ టీడీపీనా?

తప్పు వ్యాఖ్యల తర్వాత నాగేశ్వర్ టార్గెట్ టీడీపీనా?

Professor Nageshwar చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. పవన్ కళ్యాణ్‌, అమిత్ షా మధ్య జరిగినట్టుగా ప్రచారం చేసిన సమావేశ వివరాలు వాస్తవాలకు విరుద్ధమని బయటపడటంతో, ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

అయితే ఈ వ్యవహారం తర్వాత ఆయన తీవ్ర అసహనంతో తెలుగుదేశం పార్టీపై విమర్శలు మరింత పెంచారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

పవన్ కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్ కలిసి అమిత్ షాను కలిసిన సందర్భం 2023 అక్టోబర్‌లోనిదే కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి సమావేశం జరగలేదని స్పష్టమైంది. దీంతో నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఫేక్ ప్రచారంగా మారిపోయాయని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తన మాటలను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.

అయితే తప్పు బయటపడిన తర్వాత దానిపై స్పష్టత ఇవ్వడం కంటే, టీడీపీపై ఎదురుదాడి ప్రారంభించారని విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ సోషల్ మీడియా వేదికల్లో తనను "పేటీఎం పెయిడ్ ఆర్టిస్ట్"గా అభివర్ణించడంపై నాగేశ్వర్ తీవ్రంగా స్పందించగా, అదే సమయంలో పవన్ కళ్యాణ్‌, అమిత్ షా భేటీపై తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

జగన్ జైలుకు వెళ్లరని, బీజేపీ నుంచి ఆయనకు మద్దతు ఉందని, జనసేన కూడా జగన్ విషయంలో సాఫ్ట్‌గా వ్యవహరిస్తోందని నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై కూటమి అనుచరులు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ ఎజెండా ఉందా? లేక కూటమి ప్రభుత్వ పనితీరుపై అసహనమా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై గతంలోనూ నాగేశ్వర్ విమర్శలు చేసినప్పటికీ, ఈసారి మాత్రం ఆయన మాట్లాడిన తీరు మరింత దూకుడుగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. "యుద్ధం మీరు ప్రారంభించారు.. నేను ముగిస్తాను" అన్న వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర ట్రోలింగ్ కొనసాగుతోంది.

టీడీపీ శ్రేణులు మాత్రం జగన్ పాలనలో తమ కార్యకర్తలు ఎదుర్కొన్న దాడులు, కేసులు, జైలు జీవితం గుర్తుచేస్తూ.. ఇలాంటి హెచ్చరికలకు భయపడే పరిస్థితి లేదని చెబుతున్నాయి. మరోవైపు నాగేశ్వర్ వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకుడి స్థాయికి తగ్గట్లుగా లేవని, వ్యక్తిగత ఆవేశం ఎక్కువగా కనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ విశ్లేషణలో వాస్తవాలే ముఖ్యమని, విశ్లేషకుడి నమ్మకాన్ని అవే నిర్ణయిస్తాయని రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ఒకసారి ఫ్యాక్ట్ చెక్‌లో తప్పు బయటపడిన తర్వాత దాన్ని అంగీకరించడం మంచిదే కానీ, దానిని మరింత వివాదంగా మార్చడం విశ్వసనీయతకు నష్టం చేస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీ నాయకత్వం ఎప్పుడూ తనను గౌరవించిందని నాగేశ్వర్ స్వయంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయని, కానీ ఇప్పుడు అదే వర్గాలపై తీవ్ర విమర్శలు చేయడం వెనుక అసలు కారణమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చగా మారిపోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin