Trisha: తెలుగు, తమిళ భాషల్లో రెండు దశాబ్దాలకు పైగా తన అందం, నటనతో సినీరంగంలో రాణిస్తున్నారు త్రిష. ఓదశలో సౌత్ ఇండస్ట్రీ నెంబర్ వన్ గానూ నిలిచారు.
కెరీర్ ప్రారంభమై 23సంవత్సరాలు దాటినా కూడా ఇంకా హీరోయిన్ రాణిస్తూండటం విశేషం. ఇటివలే ఆమె తమిళంలో నటించిన కురుప్పు (వీరభద్రుడు) విడుదలైంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర', మోహన్ లాల్ తో 'రామ్'లో నటిస్తున్నారు. అయితే.. ఇటివల త్రిష పేరు మరో విధంగా మార్మోగుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్-కమల్ హాసన్ కలిసి నటిస్తున్న సినిమాలో త్రిష హీరోయిన్ అనే వార్త వైరల్ అయింది.
43ఏళ్ల తర్వాత రజినీ-కమల్ నటిస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఇటువంటి భారీ మల్టీస్టారర్ లో హీరోయిన్ గా అవకాశం అందుకోవడమంటే చిన్న విషయం కాదు. కానీ, ఆ అవకాశం త్రిషకు చేరిందని వార్తలు వచ్చాయి. ఇందుకు ఆమె ఏకంగా రూ.12కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. దీంతో త్రిష రేంజ్ ఈస్థాయిలో పెరిగిపోవడం కూడా సంచలనం రేపింది. అయితే.. ఈ అవకాశాన్ని త్రిష అందుకున్నట్టుగానీ, పారితోషికంపైకానీ క్లారిటీ రాలేదు.
అయితే.. త్రిష ఈ అవకాశాన్ని వద్దనుకుంటున్నారని ఆంగ్ల మీడియా, తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంత భారీ మొత్తం ఆఫర్ చేసినా తిరస్కరించడానికి కారణం సినిమాను ఉదయనిధి స్టాలిన్ నిర్మాణంలో రెడ్ జెయింట్ సంస్థ నిర్మిస్తూండటమే అని సమాచారం. ఇటివలి రాజకీయ పరిణామాల తర్వాత త్రిష తాను చేయబోయే సినిమాల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారని.. అందుకే ఈ ఆఫర్ తిరస్కరించారని అంటున్నారు. అయితే.. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. దీంతో ఇంత భారీ ప్రాజెక్టులో త్రిష భాగమయ్యారా లేదా అనే అఫిషియల్ న్యూస్ కోసం ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

