తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫార్సులు వచ్చేశాయ్. కనీస వేతనం రూ.19వేలు ఉండాలని సిఫార్సు చేసిన పీఆర్సీ.. ఉద్యోగుల మూలవేతనంపై 7.5 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సూచించింది. అలాగే పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించింది.
ఇటీవల తనకు అందజేసిన పీఆర్సీ నివేదికను ప్రభుత్వం బుధవారం బహిర్గతం చేసింది. ఈ వివరాలను ఉద్యోగ సంఘాలకు అందజేసింది. ఉద్యోగుల గరిష్ట వేతనం రూ.162,070 వరకు ఉండొచ్చని పేర్కొంది. గ్రాట్యుటీ పరిమితిని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు, శిశు సంరక్షణ సెలవులను 90 నుంచి 120 రోజులకు పెంచాలని ప్రతిపాదించింది.
అలాగే సీపీఎస్ లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలని పేర్కొంది. అయితే, హెచ్ఆర్ఏ తగ్గించాలని సిఫార్సు చేసింది. జంట నగరాల్లో 30 శాతం నుంచి 24 శాతానికి, జిల్లా కేంద్రాల్లో 20 శాతం నుంచి 17 శాతానికి, మిగిలిన ప్రాంతాల్లో 12 శాతం నుంచి 11 శాతానికి హెచ్ఆర్ఏ తగ్గించాలని సిఫార్సు చేయడం గమనార్హం. ఫలితంగా కొత్త పీఆర్సీ వల్ల వచ్చేదాని కంటే పోయేదే ఎక్కువగా ఉందని ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి.

