యూట్యూబర్ బాచలకూరి జోసెఫ్ అలియాస్ "ప్రశ్న" రావణ్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 30 నుంచి జూలై 4 మధ్య మూడు రోజుల వ్యవధిలో నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు.
ప్రతి కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే మరో పెండింగ్ కేసులో పోలీసులు తిరిగి అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
జూన్ 30న హైదరాబాద్లో పిఠాపురం పోలీసులు ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేశారు. జూన్ 28న ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. అనంతరం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే విడుదలైన కొద్ది గంటల్లోనే కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు మరో కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. 2025లో పిఠాపురంలో మైనర్ పిల్లలను రాజకీయ ఉద్దేశాలతో వీడియోల్లో ఉపయోగించారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఈ చర్య తీసుకున్నారు. ఈ కేసులోనూ పోలీసులు కోరిన జ్యుడీషియల్ రిమాండ్ను కోర్టు తిరస్కరించి బెయిల్ మంజూరు చేసింది.
సర్పవరం కేసులో విడుదలైన వెంటనే మరో పెండింగ్ కేసు ఆధారంగా పోలీసులు ప్రశ్న రావణ్ను మచిలీపట్నానికి తరలించారు. అక్కడి కేసులో కూడా కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇవ్వలేదు.
అనంతరం జూలై 4 అర్ధరాత్రి సమయంలో ఇనగుదూరు పోలీసులు మరోసారి ఆయనను అరెస్ట్ చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలు, మత విశ్వాసాలను అవమానించారనే ఆరోపణలతో మచిలీపట్నం పరిధిలో నమోదైన తాజా ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం.
ఈ వరుస అరెస్టులు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ప్రశ్న రావణ్ తరఫు న్యాయవాదులు, ప్రతిపక్ష నేతలు ఈ చర్యలను రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కేసులపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

