మధ్యప్రదేశ్లో అరుదైన వైద్య ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనివ్వడం సాధారణంగా సవాల్గా భావిస్తారు. అయితే ఈ కేసులో ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ ట్రిప్లెట్ డెలివరీ పూర్తిగా నార్మల్గా జరగడం.
వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన ఈ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సత్నా జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 34 ఏళ్ల కంచన్ సోనీ అనే మహిళకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. తాజాగా ఆమె గర్భధారణ సమయంలో వైద్యులు పరీక్షలు చేయగా, గర్భంలో ముగ్గురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. కేసు క్లిష్టంగా ఉండటంతో ఆమెను మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఏప్రిల్ 27న ఆసుపత్రిలో చేరిన కంచన్కు అదే రోజు రాత్రి ప్రసవం ప్రారంభమైంది. సుమారు గంటన్నర వ్యవధిలో మూడు సంతానాలకు జన్మనిచ్చింది. మొదటి రెండు బాబులు, ఆ తర్వాత ఒక పాప పుట్టినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రతి శిశువు ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
ముఖ్యంగా ట్రిప్లెట్ డెలివరీలు సాధారణంగా శస్త్రచికిత్స ద్వారా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సందర్భంలో నార్మల్ డెలివరీ సాఫీగా జరగడం వైద్యపరంగా విశేషమని నిపుణులు చెబుతున్నారు. పుట్టిన ముగ్గురు శిశువుల బరువు కూడా సాధారణ స్థాయిలోనే ఉండటం మరో ప్రత్యేకతగా పేర్కొంటున్నారు.
ప్రస్తుతం తల్లీ, పిల్లలు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కంచన్ సోనీ కుటుంబంలో ఇప్పుడు మొత్తం పిల్లల సంఖ్య ఏడుకు చేరింది. గ్రామంలో ఈ విషయం తెలిసిన తర్వాత స్థానికులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే ఆసుపత్రిలో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదవడం గమనార్హం. వైద్య సిబ్బంది సమన్వయంతో, సకాలంలో తీసుకున్న నిర్ణయాలతో ఈ డెలివరీ విజయవంతమైందని అధికారులు వెల్లడించారు

