దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 2012లో దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటనను గుర్తుకు తెస్తూ, తాజాగా రాణీబాగ్ ప్రాంతంలో జరిగిన లైంగిక దాడి ఘటన కలకలం రేపింది.
కదులుతున్న ప్రైవేట్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్, కండక్టర్ కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
పోలీసుల వివరాల ప్రకారం, బాధిత మహిళ సోమవారం రాత్రి తన పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సరస్వతి విహార్ బస్ స్టాప్ వద్ద వేచి ఉంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక ప్రైవేట్ బస్సు ఎక్కిన వెంటనే, డ్రైవర్ మరియు కండక్టర్ ఆమెను బలవంతంగా లోపలికి లాగినట్లు తెలుస్తోంది. అనంతరం బస్సును రాణీబాగ్ నుంచి నాంగ్లోయ్ వైపు తీసుకెళ్లారు.
బస్సు కదులుతున్న సమయంలోనే ఇద్దరు నిందితులు మహిళపై దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆమెను రాత్రంతా వేధించి, చివరికి నగర శివారులోని నిర్జన ప్రాంతంలో వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారని సమాచారం. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది.
సమాచారం అందుకున్న వెంటనే రాణీబాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు బస్సు ప్రయాణించిన మార్గాల్లో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు. ఆధారాల ఆధారంగా సంబంధిత బస్సును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
తదుపరి విచారణలో డ్రైవర్ మరియు కండక్టర్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. బస్సును ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు.
నిందితులపై గతంలో ఎలాంటి నేర చరిత్ర ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే వారి ఫోన్ కాల్ డేటా, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనతో ఢిల్లీలో రాత్రివేళ ప్రయాణించే మహిళల్లో భయం నెలకొంది. ప్రైవేట్ రవాణా వాహనాలపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేయాలని మహిళా సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాజధానిలో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మహిళల భద్రత కోసం చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలు సరిగా జరగడం లేదని సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసును వేగంగా దర్యాప్తు చేస్తూ త్వరలో చార్జ్షీట్ దాఖలు చేసే పనిలో ఉన్నారు.

