బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఆమె సంప్రదాయ లుక్లో కనిపించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నుదుటిపై సింధూరం, చేతుల్లో ఆకుపచ్చ గాజులు, మెడలో మంగళసూత్రంతో కనిపించడంతో కంగనా రహస్యంగా వివాహం చేసుకుందా అనే చర్చ మొదలైంది. అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఇదే విషయంపై ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
లేత గులాబీ రంగు చీరలో కంగనా ఇంటి నుంచి బయటకు వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఆమె సంప్రదాయ వేషధారణ చూసిన కొందరు నిజంగానే పెళ్లి జరిగిపోయిందేమోనని కామెంట్లు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కాదని తెలుస్తోంది.
ప్రస్తుతం కంగనా కొత్త సినిమా షూటింగ్లో పాల్గొంటోంది. అందులో భాగంగానే ఆమె ఈ లుక్లో కనిపించినట్లు సమాచారం. ముఖ్యంగా 'తను వెడ్స్ మను 3' కోసం ఈ గెటప్లో కనిపించిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరికొందరు మాత్రం 'క్వీన్' సీక్వెల్ షూటింగ్లో భాగంగా ఈ లుక్ ట్రై చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. దీంతో అసలు విషయం ఏంటన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
కంగనా కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో 'క్వీన్' ఒకటి. మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ చిత్రంలో కంగనా నటనకు జాతీయ అవార్డు కూడా లభించింది. ఇప్పుడు అదే చిత్రానికి కొనసాగింపుగా మరో ప్రాజెక్ట్ రూపొందుతున్నట్లు బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే, కంగనా నటిస్తున్న మరో చిత్రం 'భారత్ భాగ్య విధాత' కూడా విడుదలకు సిద్ధమవుతోంది. 2008 ముంబై ఉగ్రదాడుల సమయంలో ప్రాణాలను కాపాడిన ఓ నర్సు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆసుపత్రి సిబ్బంది ధైర్యసాహసాలను చూపించే ఈ చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
సినిమా షూటింగ్లో భాగంగా వచ్చిన ఒక లుక్నే పెళ్లి వార్తగా మార్చేయడంతో సోషల్ మీడియాలో చర్చ మరింత పెరిగింది. అయితే కంగనా మాత్రం ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.

