Dailyhunt
Tanikella Bharani : బాత్రూమ్‌లో దాక్కున్న రోజులు.. తనికెళ్ళ భరణి సంచలన నిజాలు!

Tanikella Bharani : బాత్రూమ్‌లో దాక్కున్న రోజులు.. తనికెళ్ళ భరణి సంచలన నిజాలు!

తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన తనికెళ్ళ భరణి తన కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

తన ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, సంబంధాలు, అపార్థాలు అన్నీ కలిపి తన జీవితాన్ని ఎలా మలిచాయో ఆయన ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న భరణి, "నువ్వే నువ్వే" సినిమా నుంచి ఆయన చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పారు. అయితే ఇటీవల కొన్ని సినిమాల్లో డేట్ల సమస్యల కారణంగా కలిసి పనిచేయలేకపోయామని తెలిపారు. "మిథునం" సినిమా చేస్తున్న సమయంలో తనలో వచ్చిన సందేహాలను తొలగించడంలో త్రివిక్రమ్ కీలక పాత్ర పోషించారని అన్నారు. తన ఇంటికి వచ్చి, "మీరు తీసే షాట్లే నాకు కావాలి" అంటూ ప్రోత్సహించిన సంఘటనను ఆయన హృదయపూర్వకంగా గుర్తుచేశారు.

అలాగే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ, కొన్ని అవకాశాలు ఇవ్వకపోయినా, "గాయం" వంటి సినిమాల్లో మంచి పాత్రలు ఇచ్చారని చెప్పారు. తన కెరీర్‌లో ఒక సందర్భంలో మాత్రం తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని భరణి వెల్లడించారు. "కోనసీమ కుర్రోడు" సినిమా సమయంలో జరిగిన సంఘటనను వివరిస్తూ, ఆ చిత్రానికి సంభాషణలు రాసే అవకాశం తనకు వచ్చిందని చెప్పారు. దర్శకుడు రవిరాజా పినిశెట్టి కామెడీ విషయంలో తక్కువ నమ్మకం ఉందని చెప్పగా, తాను ధైర్యంగా "కామెడీ అంటే ఎడమచేతి పని" అన్నానని గుర్తు చేసుకున్నారు. అప్పటికే "కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్" సినిమాతో కామెడీ రైటర్‌గా గుర్తింపు వచ్చిన విషయాన్ని చెప్పారు. కానీ ఆ తర్వాత రచయిత దివాకర్ బాబు నుంచి వచ్చిన ఫోన్ కాల్ తనను కలవరపరిచిందని అన్నారు. ఆ సినిమాకి అసలు రచయిత సత్యమూర్తి ఇప్పటికే కథలో భాగం రాసి, అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారని తెలిసి షాక్ అయ్యానన్నారు. ఆయనను అడగాలన్నా భయంతో అడగలేకపోయానని చెప్పారు.

సత్యమూర్తి కఠిన స్వభావం ఉన్న వ్యక్తి కావడంతో, ఆయనను ఎలా ఎదుర్కోవాలన్న భయం తనను వెంటాడిందని భరణి వివరించారు. అయినప్పటికీ, సినిమా కోసం సంభాషణలు పూర్తి చేశానని తెలిపారు. సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించినా, ఆ విజయానందం కన్నా భయం ఎక్కువగా వెంటాడిందని అన్నారు. సత్యమూర్తి నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడల్లా భయంతో దాక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయని, ఒకసారి అయితే అల్యూమినియం రాడ్ పట్టుకుని బాత్రూమ్‌లో దాక్కున్నానని ఆయన చెప్పిన ఘటన ఆసక్తికరంగా మారింది. తర్వాత "నారీ నారీ నడుమ మురారి" సినిమా సమయంలో సత్యమూర్తిని ప్రత్యక్షంగా కలిసిన భరణి, తన పరిస్థితిని వివరించి క్షమాపణ కోరినట్లు చెప్పారు. ఆయన పెద్దమనసుతో "ఏం అడుగుతున్నావు?" అంటూ అర్థం చేసుకుని మన్నించారని వెల్లడించారు. ఆ తర్వాత ఆయనను గురువుగా భావించి, ఎంతో గౌరవంతో కలిసి పనిచేశానని భరణి పేర్కొన్నారు.

తన జీవితంలో భయం కారణంగా జరిగిన ఈ ఒక సంఘటన తప్ప, ఎవరితోనూ వైరం లేదని భరణి స్పష్టం చేశారు. తన అనుభవాలు యువతకు ఒక పాఠంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Desk