Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వడదెబ్బతో ఆసుపత్రి పాలైతే.. హెల్త్ ఇన్సూరెన్స్ పనిచేస్తుందా?

వడదెబ్బతో ఆసుపత్రి పాలైతే.. హెల్త్ ఇన్సూరెన్స్ పనిచేస్తుందా?

దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా వడగాలులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ కేసులు కూడా పెరుగుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు, బయట పనిచేసే కార్మికులు ఎక్కువగా ఈ ప్రభావానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్యం పాలైతే ఆరోగ్య బీమా వర్తిస్తుందా అనే సందేహం చాలామందిలో కనిపిస్తోంది.

బీమా రంగ నిపుణుల ప్రకారం, చాలా ఆరోగ్య బీమా పాలసీలలో వడదెబ్బ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిన సందర్భాల్లో చికిత్స ఖర్చులకు కవరేజ్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా రోగి పరిస్థితి తీవ్రంగా ఉండి ఆసుపత్రిలో అడ్మిట్ అయితే గది అద్దె, ఐసీయూ ఛార్జీలు, డాక్టర్ ఫీజులు, పరీక్షలు, మందుల ఖర్చులు వంటి వాటిని పాలసీ నిబంధనల మేరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.

అయితే ప్రతి కేసులోనూ ఆటోమేటిక్‌గా క్లెయిమ్ మంజూరు అవుతుందని భావించడం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు. వడదెబ్బ కారణంగానే అనారోగ్యం వచ్చిందని వైద్యుల నివేదికలో స్పష్టంగా ఉండాలి. అలాగే రోగి కనీసం 24 గంటలపాటు ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా చికిత్స పొందినట్లు రికార్డులు ఉండాలి. పాలసీ యాక్టివ్‌లో ఉండటం, ప్రీమియంలు సకాలంలో చెల్లించి ఉండటం కూడా తప్పనిసరి.

కొన్ని సందర్భాల్లో క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యే అవకాశమూ ఉంటుంది. ఆసుపత్రిలో చేరకుండా కేవలం అవుట్‌పేషెంట్ చికిత్స మాత్రమే తీసుకుంటే చాలా బేసిక్ పాలసీలు ఖర్చులను కవర్ చేయకపోవచ్చు. అలాగే డిశ్చార్జ్ సమ్మరీ, మెడికల్ బిల్లులు, పరీక్షల నివేదికలు పూర్తిగా లేకపోతే కూడా సమస్యలు తలెత్తవచ్చు. బీమా సంస్థకు నిర్ణీత సమయంలో సమాచారం ఇవ్వకపోయినా క్లెయిమ్ ఆమోదం ఆలస్యం కావచ్చు లేదా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.

కొన్ని పాత ఆరోగ్య బీమా పాలసీలలో వాతావరణ మార్పులు లేదా ప్రకృతి ప్రభావాల వల్ల వచ్చే అనారోగ్యాలపై ప్రత్యేక పరిమితులు ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పాలసీ తీసుకునే ముందు నిబంధనలను పూర్తిగా చదవడం అవసరమని సూచిస్తున్నారు.

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. అవసరం లేకపోతే మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం, తగినంత నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. అదే సమయంలో ఆరోగ్య బీమా పాలసీలో ఏయే వ్యాధులకు కవరేజ్ ఉందో ముందుగానే తెలుసుకుంటే అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Desk