Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్సీబీపై సన్ రైజర్ విజయం.. అయినా మూడో స్థానానికే పరిమితం

ఆర్సీబీపై సన్ రైజర్ విజయం.. అయినా మూడో స్థానానికే పరిమితం

పీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీపై అద్భుత విజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

అయితే.. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవాలన్న సన్‌రైజర్స్ ఆశ నెరవేరలేదు. సమీకరణాల కారణంగా మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు.

నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 79 , అభిషేక్ శర్మ 22 బంతుల్లో 56 , హెన్రిచ్ క్లాసెన్ 24 బంతుల్లో 51 పరుగులతో చెలరేగారు. చివరిలో నితీశ్ కుమార్ రెడ్డి కూడా12 బంతుల్లో 29 నాటౌట్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు తో 44 పరుగులు చేసి అద్భుత ఆరంభాన్నిచ్చాడు.

ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 4.3 ఓవర్లకే జట్టు స్కోరును 60 పరుగులకు చేర్చాడు. అయితే, ఇషాన్ మలింగ బౌలింగ్‌లో అతను ఔటవ్వడంతో ఆర్సీబీ పరుగుల వేగానికి కళ్లెం పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 15 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ , 12 పరుగులకు దేవదత్ పడిక్కల్ కూడా పెవిలియన్ చేరడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ రజత్ పటీదార్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 56 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు.

కృనాల్ పాండ్యతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా, అవసరమైన రన్‌రేట్ భారీగా పెరిగిపోవడంతో ఒత్తిడి పెరిగింది. పటీదార్ అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత ఔటయ్యాడు. చివరిలో కృనాల్ పాండ్య 41 నాటౌట్ , టిమ్ డేవిడ్ 15 నాటౌట్ ధాటిగా ఆడినా.. ఫలితం లేకపోయింది.

సన్‌రైజర్స్ బౌలర్లలో మలింగ రెండు వికెట్లతో రాణించగా, సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌లలో 9 విజయాలతో లీగ్ దశను ముగించింది. అయితే.. మూడో స్థానంలో నిలవడంతో ఈ నెల 27న ముల్లన్ పూర్ లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది.

ఈ మ్యాచ్‌లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిస్తే ఫైనల్ బెర్త్ కోసం క్వాలిఫయర్ 2లో తలపడుతుంది. అటు.. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ కూడా 14 మ్యాచ్ లలో 9 విజయాలు నమోదు చేశాయి.

అయితే, మెరుగైన రన్ రేట్ కారణంగా ఆర్సీబీ తొలి స్థానంలో, గుజరాత్ రెండో స్థానంలో నిలిచాయి. మూడు బెర్తులు స్టాండింగ్స్ తో సహా ఖరారైన నేపథ్యంలో.. నాలుగో బెర్తు కోసం రాజస్థాన్, పంజాబ్, కోల్ కతా, ఢిల్లీ జట్ల మధ్య పోటీ నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One