వరంగల్ బహిరంగ మార్కెట్లో అరుదైన రెండు తలల పాములను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. 'ఈ పాములను ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం కలిసి వస్తుంది… ధనవంతులు వీటిని పెంచుకుంటారు' అంటూ మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని కొనుగోలుదారులను ఆకర్షించేందుకు నిందితుడు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది.
వివరాల్లోకి వెళ్తే… వరంగల్ జిల్లాలోని గ్రే మార్కెట్లో రెండు తలల పాముల అక్రమ విక్రయాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు అందింది. దీంతో అధికారులు ప్రత్యేక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. వేషం మార్చుకున్న ఓ డీఆర్ఐ అధికారి కస్టమర్గా నిందితుడిని సంప్రదించి, తన వద్ద ఉన్న పాములను చూపించాలని కోరాడు.నిందితుడు బ్యాగ్ తెరిచి చూపించగానే అందులో ఇండియన్ రెడ్ సాండ్ బోవా జాతికి చెందిన రెండు అరుదైన పాములు కనిపించాయి. వెంటనే అక్కడే సిద్ధంగా ఉన్న అధికారులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకుని పాములను స్వాధీనం చేసుకున్నారు.
ఈ జాతి పాములను ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం వస్తుందనే ప్రచారం, క్షుద్ర పూజలు, గుప్తనిధుల అన్వేషణ, అలాగే కొన్ని రకాల ఆయుర్వేద మందుల తయారీ పేరుతో వీటికి భారీ డిమాండ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మూఢనమ్మకాలను నమ్మించేలా చేసి అక్రమ వ్యాపారం నడుపుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లో ఒక్క పాము ధర రూ.2 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితుడు అటవీ ప్రాంతాల నుంచి ఈ అరుదైన పాములను సేకరించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అధికారులు పట్టుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న పాములను, నిందితుడిని వరంగల్ ఫారెస్ట్ రేంజ్ అధికారులకు అప్పగించారు. ఈ కేసు వెనుక ఉన్న పెద్ద రాకెట్పై అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

