Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్ధరాత్రి నడిరోడ్డుపై నటి శ్యామల కూకట్‌పల్లిలో క్యాబ్ డ్రైవర్ దారుణం

అర్ధరాత్రి నడిరోడ్డుపై నటి శ్యామల కూకట్‌పల్లిలో క్యాబ్ డ్రైవర్ దారుణం

తెలుగు సినీ పరిశ్రమలో వందలాది చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటిగా నటించి తనదైన నటనతో ప్రేక్షకులను నవ్వించిన సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Shyamala) దీనస్థితి ఇప్పుడు అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది.

ఖడ్గం, ఆంధ్రావాలా, గోలీమార్ వంటి చిత్రాల్లో అద్భుతమైన నటన కనబరిచిన ఆమె.. వయోభారం, తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఆమెకు ఎదురైన ఒక అత్యంత అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పావలా శ్యామల..

అర్ధరాత్రి సమయంలో కూకట్‌పల్లి నడిరోడ్డుపై నిస్సహాయ స్థితిలో ఒంటరిగా మిగిలిపోవడం సినీ వర్గాల్లో, సామాన్య ప్రజల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తీవ్రమైన గుండెనొప్పితో బాధపడుతున్న పావలా శ్యామల అత్యవసర వైద్యం కోసం కూకట్‌పల్లిలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. అయితే, చికిత్సకు అవసరమైన డబ్బులు ఆమె వద్ద లేకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించిందని సమాచారం.

తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆమెను ఆసుపత్రి సిబ్బంది బయటకు పంపించి, ఒక ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసి అందులో పంపించేశారు. కానీ, ఆ క్యాబ్ డ్రైవర్ మరింత అమానవీయంగా ప్రవర్తించాడు. అర్ధరాత్రి సమయంలో తీవ్ర అనారోగ్యంతో కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధురాలనే మానవత్వం కూడా లేకుండా, కూకట్‌పల్లి వై జంక్షన్ (Kukatpally Y Junction) వద్ద ఉన్న ఫుట్‌పాత్‌పై ఆమెను అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ కారు డ్రైవర్ చేసిన దారుణానికి పావలా శ్యామల అర్ధరాత్రి నడిరోడ్డుపై దిక్కుతోచని స్థితిలో, తీవ్ర అస్వస్థతతో కనిపించారు.

అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు ఆమెను గుర్తుపట్టి, వెంటనే అలర్ట్ అయ్యారు. ఒక సీనియర్ నటి నడిరోడ్డుపై అలా పడి ఉండటం చూసి చలించిపోయిన స్థానికులు, వెంటనే స్థానిక పోలీసులకు, ఆమెకు గతంలో ఆశ్రయం కల్పించిన 'ఆర్కే ఫౌండేషన్' నిర్వాహకులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను సనత్‌నగర్‌లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

గత రెండు మూడు సంవత్సరాలుగా ఆర్కే ఫౌండేషన్‌లో ఉచితంగానే వైద్యం పొందుతున్నప్పటికీ, అక్కడ కార్డియాలజీ విభాగం లేకపోవడంతోనే ఆమె బయట ఆసుపత్రికి రావాల్సి వచ్చిందని ఫౌండేషన్ అధినేత డాక్టర్ రామకృష్ణ తెలిపారు. గతంలో పావలా శ్యామల ఆర్థిక కష్టాల గురించి తెలిసి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, సాయి దుర్గ తేజ్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. ప్రస్తుతం ఆమె తిరుమలగిరిలోని ఒక స్వచ్ఛంద ఆశ్రయంలో తన కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. ప్రముఖులు సాయం చేసినప్పటికీ..

ఆమె వయోభారం, నిరంతర అనారోగ్య ఖర్చుల కారణంగా పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక వృద్ధురాలిని, సీనియర్ నటిని ఆసుపత్రి చేర్చుకోకపోవడం, క్యాబ్ డ్రైవర్ నడిరోడ్డుపై వదిలేయడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA), సినీ పెద్దలు శాశ్వతంగా ఆమెకు వైద్య సదుపాయం అందేలా చూడాలని అభిమానులు కోరుతున్నారు. కాగా, పావలా శ్యామల పరిస్థితి తెలుసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. సాయం చేయడం కోసం తన టీంను ఆసుపత్రికి పంపినట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One