సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ ననాయకుడు చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. మధు హత్య స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఎర్కారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ.. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న ఒ నాయకుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు మధును దారుణంగా నరికి చంపారు.
హత్య అనంతరం సాక్ష్యాలను తారుమారు చేసేందుకు శరీర భాగాలను గోనె సంచుల్లో గట్టిగా కట్టేశారు. ఆపై ఆ గోనె సంచులను సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ కాల్వలో పడేశారు. కాల్వలో అనుమానాస్పదంగా పడి ఉన్న గోనె సంచులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, కెనాల్ నుంచి ఆ గోనె సంచులను వెలికితీసి బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు మృతదేహ భాగాలుగా గుర్తించారు.
ఈ ఘోర క్రూరమైన హత్యకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్ టీమ్ సహాయంతో సంఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించారు. ఈ దారుణ హత్యోదంతం తెలియగానే ఎర్కారం గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు, ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మధు అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హంతకులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

