మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ ఎమ్మెల్యే నుంచి గుర్తు తెలియని వ్యక్తులు మొబైల్ ఫోన్ ను బలవంతంగా లాక్కుని పారిపోయారు. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగింది.
మార్నింగ్ వాక్ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ధరమ్లాల్ కౌశిక్ చేతిలోని మొబైల్ ఫోన్ను బలవంతంగా లాక్కొని పారిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తున్న అత్యంత కీలక సమయంలోనే ఈ చోరీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీడబ్ల్యూడీ వంతెన సమీపంలో ఎమ్మెల్యే ధరమ్లాల్ కౌశిక్ రోజూలాగే మార్నింగ్ వాక్ చేస్తున్నారు.
ఆ సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా ఆయనపై పడి చేతిలోని ఫోన్ను గుంజుకొని క్ష అక్కడి నుంచి పరారయ్యారు. ఎమ్మెల్యే వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధి ఫోన్ చోరీకి గురికావడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రంగంలోకి దిగారు. ఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న వందలాది సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల కదలికలను పరిశీలించారు. దీంతో కేవలం ఎనిమిది గంటల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు. బలోదాబజార్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నగరంలో బైక్ ట్యాక్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు విచారణలో తేలింది.
అతని వద్ద నుండి ఎమ్మెల్యే నుంచి చోరీ చేసిన మొబైల్ ఫోన్తో పాటు.. నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా ఏకంగా ఎమ్మెల్యే ఫోన్ నే దొంగిలించిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
అదీ కేంద్ర హోంమంత్రి రాయ్ పూర్ లో ఉన్న సమయంలోనే.. అధికార పార్టీ ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. రాయ్ పూర్ లో శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉందనీ, దోపిడీలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నేత సుశీల్ ఆనంద్ శుక్లా ఆరోపించారు.

