దేశంలో భానుడి భగభల కారణంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టేందుకే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఎండ తీవ్రత పీక్స్ కు చేరుకోవడంతో.. ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీ, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం భారీగా పెరిగింది.
దీంతో దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా సరికొత్త రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు గురువారం (మే 21) మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల సమయంలో దేశంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఏకంగా 270.82 గిగావాట్ల విద్యుత్ వాడకం నమోదింది. ఇది భారత విద్యుత్ రంగ చరిత్రలో కొత్త రికార్డు.
ప్రభుత్వం ఈ వేసవి కాలానికి అంచనా వేసిన గరిష్ట డిమాండ్ 270 గిగావాట్లను కూడా ఈ రికార్డు దాటేసింది. ఈ మే నెలలోనే వరుసగా నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ విద్యుత్ వినియోగం.. పాత రికార్డులను తిరగరాస్తూ దూసుకుతున్నది. మే 18 సోమవారం నాడు గరిష్ట విద్యుత్ డిమాండ్ 257.37 గిగావాట్లుగా నమోదై.. అప్పటివరకు ఉన్న పాత రికార్డులను బ్రేక్ చేసింది.
ఆ మరుసటి రోజు, అంటే మే 19 మగళవారం విద్యుత్ వినియోగం 260.45 గిగావాట్లకు చేరింది. అలాగే మే 20 బుధవారం ఇది 265.44 గిగావాట్లకు చేరింది. మే 21 గురువారం నాటికి ఏకంగా 270.82 గిగావాట్ల ఆల్టైమ్ హై రికార్డును నమోదు చేసింది. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండటంతో, అదే సమయంలో కరెంట్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ పెరుగుదల చాలా భారీగా ఉంది.

