ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) శరవేగంగా విస్తరిస్తోంది. అయితే ఈ టెక్నాలజీ విప్లవం మానవ వనరులపై, ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువతపై తీవ్ర ప్రభావం చూపనుందని ప్రముఖ ఏఐ సంస్థ 'ఆంథ్రోపిక్' ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) డారియో అమోడెయ్ హెచ్చరించారు.
భవిష్యత్తులో కార్పొరేట్ రంగంలో ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల ఉనికి ప్రశ్నార్థకం కానుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డారియో అమోడెయ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కేవలం రెండు సంవత్సరాల క్రితం ఒక సాధారణ హైస్కూల్ విద్యార్థి స్థాయి నైపుణ్యాలు మాత్రమే ప్రదర్శించిన ఏఐ, ప్రస్తుతం ఒక ప్రతిభావంతుడైన కాలేజీ విద్యార్థిని మించిన సామర్థ్యాలను సంతరించుకుందని ఆయన విశ్లేషించారు. టెక్నాలజీ ఇంత వేగంగా వృద్ధి చెందడం ఊహించని పరిణామమని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏఐ టూల్స్ కేవలం సమాచారాన్ని సేకరించడమే కాకుండా.. సంక్లిష్టమైన ఆర్థిక నివేదికల తయారీ, సరికొత్త ఐడియాలను సృష్టించడం, డాక్యుమెంట్ల విశ్లేషణ వంటి పనులను క్షణాల్లో పూర్తి చేస్తున్నాయి. దీనివల్ల ముఖ్యంగా ఫైనాన్స్, మేనేజ్మెంట్ కన్సల్టింగ్, ఐటీ రంగాల్లో ప్రాథమిక స్థాయి (ఎంట్రీ లెవల్) ఉద్యోగాల నియామకాలు భారీగా తగ్గే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. రానున్న ఒకటి నుంచి ఐదేళ్ల వ్యవధిలోనే ఉద్యోగ మార్కెట్పై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని డారియో అమోడెయ్ స్పష్టం చేశారు.
ఈ రాబోయే విపత్తు గురించి టెక్ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు, సీఈఓలు అంతర్గతంగా తీవ్ర ఆందోళన చెందుతున్నప్పటికీ, సాధారణ ప్రజలకు మరియు ప్రభుత్వాలకు దీని తీవ్రతపై ఇంకా పూర్తి అవగాహన రాకపోవడం విచారకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, ఉద్యోగాల పరిరక్షణ కోసం ఏఐ పరిశోధనలను లేదా అభివృద్ధిని నిలిపివేయవచ్చా అనే ప్రశ్నలపై కూడా ఆయన స్పందించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో అది అసాధ్యమని తేల్చిచెప్పారు. ముఖ్యంగా అమెరికా, చైనా దేశాల మధ్య సాంకేతిక రంగంలో తీవ్రమైన పోటీ నెలకొందని..
ఒకవేళ పశ్చిమ దేశాలు ఈ పరిశోధనలను ఆపితే, చైనా ఆ స్థానాన్ని ఆక్రమించి ప్రపంచాన్ని శాసిస్తుందని ఆయన విశ్లేషించారు. మారే కాలానికి అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడమే ఏకైక మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ టూల్స్ను సమర్థవంతంగా ఉపయోగించగల వారికి మాత్రమే భవిష్యత్తు ఉంటుందని పేర్కొంటున్నారు. అదే సమయంలో, ఈ సాంకేతికత వల్ల తలెత్తే ఆర్థిక అసమానతలను అరికట్టడానికి మరియు ఉపాధి కోల్పోయే కార్మికులను ఆదుకోవడానికి భవిష్యత్తులో ప్రభుత్వాలు ఏఐ కంపెనీలపై ప్రత్యేక పన్నులు విధించే అవకాశం కూడా లేకపోలేదని డారియో అమోడెయ్ జోస్యం చెప్పారు.

