ఒక నివాస గృహంలో వంటగ్యాస్ లీకై సంభవించిన పేలుడు కారణంగా 9 మంది తీవ్రంగా గాయపడి అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలో ఆదివారం (మే 17) రాత్రి జరిగింది.
స్థానికంగా నివసించే సంతోష్ లోధి అనే వ్యక్తి ఇంటిలో గ్యాస్ సిలెండర్ కు ఉన్న పైపు లీకయ్యింది. ఆ విషయాన్ని ఇంట్లో వారెవరూ గమనించలేదు.మామూలుగా వంట చేయడానికి గ్యాస్ ముట్టించడానికి లైటర్ వెలిగించగానే ఒక్క సారిగా సిలిండర్ పేలి ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఇంట్లో ఉన్న ఆరుగురూ మంటల్లో చిక్కుకున్నారు. వారి అర్తనాదాలు విని సాయం చేయడానికి ఇంట్లోకి వెళ్లిన ముగ్గురు పొరుగువారు కూడా మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి తీవ్రంగా గాయపడిన తొమ్మండుగురినీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

