Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. పది రోజుల్లో మూడో సారి

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. పది రోజుల్లో మూడో సారి

దేశంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై చమురు సంస్థలు ఇంధన ధరల భారం మోపాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతుండటంతో.. దేశీయ చమురు సంస్థలు శనివారం ( మే 23) మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.

గత 10 రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు, ఇరాన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హెర్మూజ్ జలసంధి లో రవాణాకు ఎదురౌతున్న ఆటంకాలు.. ధరల పెరుగుదలకు కారణం.

ఇండియా తన మొత్తం ముడి చమురు అవసరాలలో దాదాపు 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అలాగే సగానికి పైగా సహజ వాయువు అవసరాలకు కూడా విదేశాల నుంచి వచ్చే దిగుమతులే ఆధారం. ఈ సరఫరా ఎక్కువగా మధ్యప్రాచ్య దేశాల నుంచే జరుగుతుంది. తాజా పెంపు ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 87 పైసలు పెరిగి రూ.98.64 నుంచి రూ.99.51 కి చేరుకుంది. అలాగే ఢిల్లీలో డీజిల్ ధర లీటరుకు 91 పైసలు పెరిగి రూ.91.58 నుంచి రూ.92.49 కి ఎగబాకింది. కోల్‌కతా లో పెట్రోల్ ధరపై 94 పైసలు పెరగడంతో, అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.109.7 నుంచి రూ.110.6 కి చేరింది. అక్కడ డీజిల్ ధర కూడా 95 పైసలు పెరిగి రూ.97 కి చేరింది.

ఇక ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర 90 పైసలు పెరిగి రూ.108.4 కి చేరగా, డీజిల్ ధర 94 పైసలు పెరిగి రూ.95 గా నమోదైంది. చెన్నైలో పెట్రోల్ ధర 82 పైసలు పెరిగి రూ.105.3 కి చేరగా, డీజిల్ ధర లీటరుకు 87 పైసలు పెరిగి రూ.96.9 కి పెరిగింది. కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సీఎన్‌జీ (సీఎన్జీ) ధరలను కూడా కిలోకు రూ.1 చొప్పున పెంచడంతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.81.09 కి చేరింది. ఈ ఇంధన ధరల పెంపు తొలి సారి మే 15 న, ఆ తర్వాత వెంటనే మే 19 న రెండోసారి కూడా చమురు కంపెనీలు ధరలను పెంచాయి.

ఇప్పుడు శనివారం జరిగిన తాజా పెంపుతో కలిపి గత 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 5 రూపాయల మేర పెరిగాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించిన గణాంకాల ప్రకారం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా రేట్లను నియంత్రించడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు దాదాపు రూ.2 లక్షల కోట్ల వరకు నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇందులో కేవలం ఉత్పత్తి వ్యయానికి, విక్రయ ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసం వల్లే లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. లక్ష కోటి వరకు నష్టం వాటిల్లింది.

మే 11 న కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలకు ఎలాంటి తక్షణ బెయిలౌట్ ప్యాకేజీని ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో, కంపెనీలు తమ నష్టాల నుంచి బయటపడటానికి ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో దేశీయంగా ఇంధన ధరలు లీటరుకు మరో రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది. ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One