సామాన్యుడి నెత్తిన మరో సారి పెట్రో బాంబ్ పేలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా సవరణ ప్రకారం..
లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై సగటున 90 పైసలు పెరిగింది. ఈ పెంపు వెంటనే అమలులోకి వచ్చింది. దీంతో మంగళవారం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 110.89 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర లీటరు .98.96 రూపాయలకు పెరిగింది. సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపే ఈ ధరల పెంపుదల, రవాణా రంగంపై కూడా అదనపు భారాన్ని మోపనుంది.
మధ్య ప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో.. దేశీయంగా ఇంధన ధరలను సవరించక తప్పలేదని చమురు సంస్థలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ బలహీనపడటం కూడా దేశీయంగా పెట్రో ధరల పెరుగుదలకు మరో కారణంగా నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత దేశంలో చమురు ధరలు పెరగడం ఇది రెండో సారి. ఎన్నికల సమయంలో ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ, ఎన్నికల ప్రక్రియ ముగియగానే పెట్రో ధరల వడ్డింపు మొదలు కావడం గమనార్హం.

