మౌంట్ ఎవరెస్ట్ యాత్రకు వెళ్లిన ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. పర్వతారోహణ ముగించుకొని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు నేపాల్ అధికారులు తెలిపారు.
నేపాల్ ఎక్స్పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ వివరాల ప్రకారం.. బాధితులు శిఖరం నుంచి కిందకు దిగుతుండగా తీవ్ర అలసటతో అస్వస్థతకు గురయ్యారు. వారిని రక్షించేందుకు గైడ్స్ తీవ్రంగా ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. మృతులను భారత్కు చెందిన అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరేగా గుర్తించారు.
ఎవరెస్ట్ శిఖరాన్ని బుధవారం (మే20) అధిరోహించిన 274 మందిలో భారత్కు చెందిన సందీప్ ఆరే, తులసి రెడ్డి పాల్పునూరి, అజయ్ పాల్ సింగ్ మరో ఇద్దరు ఉన్నారు. ఒకే రోజులోనే అత్యధిక సంఖ్యలో ఎవరెస్ట్ను అధిరోహించిన బృందంగా వీరు రికార్డు సృష్టించారు. అయితే.. పర్వత శిఖరానికి చేరుకుని కిందకు దిగుతుండగా సందీప్ ఆరే అస్వస్థతతో మృతి చెందారు.
గురువారం ((మే21) సాయంత్రం మరో బృందంలో వెళ్లిన అరుణ్ కుమార్ తివారీ తిరిగి వస్తుండగా మృతి చెందారు. కిందికి దిగుతున్నప్పుడు తివారీ హిల్లరీ స్టెప్ సమీపంలో మరణించినట్లు సమాచారం. షెర్పా రెస్క్యూ బృందం కిందకు తీసుకువచ్చిన తర్వాత సందీప్ ఆరే క్యాంప్ II వద్ద మరణించాడు.

