ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సీజన్ లో ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ప్రస్తుత సీజన్లో ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది.
ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన పోరులో బెంగళూరు ఘన విజయం సాధించి ఈ మైలురాయిని అందుకుంది. ఈ అద్భుత విజయంపై ఆర్సీబీ మాజీ యజమాని విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్సీబీ ఆటగాళ్లను నమ్మ దొడ్డ సింహగళు (మన పెద్ద సింహాలు) అని సంబోధిస్తూ, అందరికంటే ముందే ప్లేఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేసుకుని అభిమానులందరూ గర్వపడేలా చేశారని మాల్యా పేర్కొన్నారు. మైదానంలో అగ్రసివ్ గా ఆడుతూ నిజమైన సింహాల కంటే బిగ్గరగా గర్జించారని అభినందించారు.
ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీ అత్యుత్తమ జట్టు అని పేర్కొన్న మాల్యా.. ఆర్సీబీ టైటిల్ ను నిలబెట్టుకోవడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికను పరిశీలిస్తే ఆర్సీబీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్లలో తొమ్మిది గెలిచి 18 పాయింట్లు సాధించిన బెంగళూరు అగ్రస్థానంలో కొనసాగుతోంది.
మే 22న హైదరాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో ఆర్సీబీ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో కూడా విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాల్లో ఒకటి ఖాయం. గత ఏడాది టైటిల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ, ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తోంది. ఈ సీజన్లోనూ ట్రోఫీని ముద్దాడి తమ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకోవాలన్న పట్టుదల ఆ జట్టులో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆర్సీబీ ఈ సారి టైటిల్ సాధిస్తే.. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) తర్వాత వరుసగా రెండుసార్లు ట్రోఫీని గెలుచుకున్న మూడో జట్టుగా రికార్డు సాధిస్తుంది.

