ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సరికొత్త సాంకేతిక హంగులతో, ప్రపంచపటంలోనే ఒక అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ గ్లోబల్ సిటీగా అవతరించబోతోంది. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన సంస్థ 45వ వార్షికోత్సవం, అలాగే ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అద్భుతమైన విజన్ను ప్రపంచం ముందు ఉంచారు.
అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. ఇండియా ఒక గ్లోబల్ సూపర్పవర్గా ఎదిగే దిశగా వేగంగా దూసుకుపోతోందన్న చంద్రబాబు.. భవిష్యత్ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్టిఫిషియల్ ఇంటె లిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, డేటా పార్కులు, డ్రోన్ ఇన్నోవేషన్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. వచ్చే ఏడాది నాటికి ప్రతిష్టాత్మక పోలవరం సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని ప్రకటించారు.
ప్రస్తుత ప్రపంచం యుద్ధాలు, అస్థిరత, అంతర్గత కలహాలతో సతమతమవుతోందనీ, ఇలాంటి క్లిష్ట సమయాల్లో సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, ఒత్తిడి లేని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడం ఎంతో అవసరమన్నారు. ఈ దిశగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 182 దేశాలలో దాదాపు 10,000 కేంద్రాలను ఏర్పాటు చేసి, ఈ సంస్థ అద్భుతమైన సేవలందిస్తోందని కొనియాడారు. నైపుణ్యాభివృద్ధి, విలువలతో కూడిన విద్య, పునరావాస కార్యక్రమాలు, జల సంరక్షణ మరియు గ్రామీణాభివృద్ధి వంటి 5 ముఖ్యమైన రంగాలలో ఈ సంస్థ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని ప్రశంసించారు.

