Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ఎంతో తెలుసా?

పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ఎంతో తెలుసా?

పాకిస్థాన్ ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశంలో ద్రవ్యోల్బణం మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరడంతో సామాన్య ప్రజలు నిత్యావసరాలు కొనలేక అల్లాడిపోతున్నారు.

ఇటువంటి గడ్డు కాలంలో అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత కుదేలు చేశాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్నయుద్ధ వాతావరణం, పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ఈ అంతర్జాతీయ సంక్షోభం కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు ఏకంగా 110 డాలర్ల పైకి చేరాయి. చమురు దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడే పాకిస్థాన్‌కు ఈ ధరల పెరుగుదల శరాఘాతంగా మారింది.

అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లను తట్టుకోలేక మే మొదటి వారంలో అక్కడి ప్రభుత్వం లీటర్ పెట్రోల్ ధరను ఏకంగా రూ.14.92 మేర పెంచింది. దాంతో పాకిస్థాన్ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ ధర గరిష్ఠంగా రూ.414.78 కి చేరింది. లీటర్ పెట్రోల్ ధర దాదాపు 415 రూపాయలకు చేరడంతో సామాన్యుడు వాహనం బయటకు తీయాలంటేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంధన ధరలను సమీక్షిస్తుంటుంది.

ఇందులో భాగంగా తాజాగా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరుకు రూ.5 మేర స్వల్పంగా తగ్గించి కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసింది. తాజా తగ్గింపు తర్వాత ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.409.78 వద్ద, అలాగే హై-స్పీడ్ డీజిల్ ధర కూడా లీటర్‌కు రూ.409.58 వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వ సమీక్షలో ధరలు స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ.. సామాన్య ప్రజల కోణం నుంచి చూస్తే లీటర్‌కు రూ.410 అనేది నిస్సందేహంగా మోయలేని మహా భారం.

ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగడంతో పాకిస్థాన్‌లో రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. రవాణా భారం పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడి దైనందిన జీవితాన్ని మరింత నరకప్రాయంగా మార్చాయి. పెట్రోల్ కొనడం తమ ఆర్థిక పరిధిని దాటిపోవడంతో అక్కడి ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇంధన ధరల నియంత్రణపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే మున్ముందు దేశంలో ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One