దేశవ్యాప్తంగా పిల్లలు, వ్యక్తులు కనిపించకుండా పోయే ఘటనలపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా చిన్నారి, వ్యక్తి కనిపించకపోతే మిస్సింగ్ కేసు గా కాకుండా నేరుగా కిడ్నాప్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో ఇప్పటికీ దాదాపు 47 వేల మంది పిల్లలు ఆచూకీ లేకుండా ఉండటం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్న సుప్రీంకోర్టు, కనిపించకుండా పోయిన ప్రతి నిమిషం కీలకం. పోలీసుల నిర్లక్ష్యం, ఆలస్యం పిల్లలను మరింత ప్రమాదంలోకి నెట్టొచ్చు అని హెచ్చరించింది. ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ప్రాథమిక విచారణ పేరుతో ఆలస్యం చేయొద్దు.
కుటుంబ సభ్యులనే వెతకమని వదిలేయడం అస్సలు సరైంది కాదు అని కోర్టు స్పష్టం చేసింది. అంతే కాదు, బీఎన్ఎస్ ప్రకారం కిడ్నాప్ సెక్షన్లు తప్పనిసరిగా చేర్చాలని ఆదేశించింది. ఇది చిన్న సమస్య కాదు.. దేశాన్ని కుదిపే అంశం...
వేలాది పిల్లలు కనిపించకుండా పోతుంటే సమాజం మౌనంగా ఎలా ఉంటుంది? ఈ వాస్తవాన్ని చూసీ చూడ నట్టుగా ఎలా ఉండగలం?' అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. తమిళనాడులో 2011 నుంచి కనిపించకుండా పోయిన ఒక చిన్నారి కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.

