కిందపడ్డా తనదే పైచేయి అని అర్థం లేని లాజిక్తో ప్రగల్భాలు పలుకుతుంటారు కొందరు. సరిగ్గా అదే వైఖరి కొనసాగిస్తూ అభాసుపాలవుతోంది దాయాది దేశం పాకిస్థాన్.
గతేడాది భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతీకారంగా తాము 'బునియాన్ ఉల్ మర్సూస్' ఆపరేషన్ చేపట్టామని పాకిస్థాన్ సైనికాధికారి ఒకరు ప్రకటించారు. భారత్లోని 'రాజౌరి ఎయిర్బేస్', 'మామున్ ఎయిర్బేస్'లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ప్రగల్భాలు పలికారు. అయితే అసలు ఆ పేర్లతో భారత వైమానిక దళానికి ఎలాంటి ఎయిర్బేస్లు లేకపోవడం గమనార్హం. రాజౌరి అనేది జమ్మూ కశ్మీర్లోని ఒక జిల్లా.
అక్కడ భారత వైమానిక దళానికి ఎలాంటి యాక్టివ్ ఎయిర్బేస్ లేదు . అలాగే మామున్ అనేది పంజాబ్లోని పఠాన్కోట్ సమీప సైనిక కంటోన్మెంట్ ప్రాంతం. అక్కడ కూడా ఇండియన్ ఎయిర్ఫోర్స్కు ఎయిర్బేస్ లేదు. ఆ విషయం తెలుసుకోకుండా పాక్ అధికారి అబద్ధాలు చెప్పడం సోషల్ మీడియాలో విమర్శలకు తావిస్తోంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్లోని రాజౌరీ, మమూన్ ఎయిర్బేస్లను ధ్వంసం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని సదరు పాక్ అధికారి తెలిపారు . దాంతో తాము ఫతా-1 క్షిపణులతో ఆ రెండు ఎయిర్బేస్లను ధ్వంసం చేశామని పేర్కొన్నారు. అయితే భారత్లో అలాంటి ఎయిర్బేస్లే లేకపోవడంతో ఆ పాక్ అధికారిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

