Dailyhunt
తెలంగాణలో స్విగ్గి, బిగ్ బాస్కెట్ ల ద్వారా పాల సరఫరా!

తెలంగాణలో స్విగ్గి, బిగ్ బాస్కెట్ ల ద్వారా పాల సరఫరా!

ప్రజలకు నిత్యావసర వస్తువైన పాలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మంత్రి కార్యాలయంలో వివిధ డెయిరీల ప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. విజయ డెయిరీ, హెరిటేజ్, జెర్సీ, దొడ్ల, కరీంనగర్, మస్కటి, అమూల్, నార్మూల్, తిరుమల, ముకుంద డెయిరీల ప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రన్, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, విజయ డెయిరీ ఎం.డి శ్రీనివాస్ రావు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

కరోనా నేపద్యంలో డోర్ డెలివరీ సక్రమంగా జరగకపోవడంతో స్విగ్గి, బిగ్ బాస్కెట్ ల ద్వారా పాల సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ప్రస్తుత సమయంలో అధిక ధరలకు పాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు.

పాల సరఫరాలో వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. పాల సరఫరా చేసే సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించేలా డెయిరీల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

పశువుల దాణా, పశుగ్రాసాన్ని అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

జిల్లా అధికారులు పంపిణీ దారుల గోదాములపై తనిఖీ నిర్వహించి అక్రమ నిల్వలతో కొరత సృష్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశుగ్రాసం అందుబాటులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One