మిస్ పూణే కిరీటం, ఎంబీఏ పట్టా, ఉన్నత చదువులు, కార్పొరేట్ మార్కెటింగ్లో మంచి కెరీర్, యోగా ట్రైనర్గా ప్రశాంతమైన జీవితం. చూసే ఎవరికైనా ట్విషా శర్మ(Twisha sharma)జీవితం ఎంతో అందంగా, ఆదర్శంగా కనిపించేది.
కానీ, వివాహ బంధం అనే కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిన కేవలం ఐదు నెలలకే ఆ జీవితం చిన్నాభిన్నమైపోయింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మే 12 రాత్రి జరిగిన ట్విషా మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. డేటింగ్ యాప్ ద్వారా భోపాల్కు చెందిన లాయర్ సమర్థ్ సింగ్ తో ట్విషా పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరు గత ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు.
సమర్థ్ తల్లి గిరిబాలా సింగ్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి. కానీ, పెళ్లయిన కొన్ని రోజులకే అసలు రంగు బయటపడింది. ఉన్నత విద్యావంతురాలైన ట్విషాని ఆమె అత్తగారు, భర్త తీవ్రంగా మానసిక వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. ఉద్యోగం మానేసినందుకు 'నువ్వొక దండగమారివి', 'మాపై భారం' అంటూ ప్రతిరోజూ సూటిపోటి మాటలతో వేధించేవారు.
త్విషా తండ్రి ఆమె పేరు మీద ఉంచిన 20 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ను తన పేరిట బదిలీ చేయాలంటూ భర్త సమర్థ్ సింగ్ నిరంతరం ఒత్తిడి తెచ్చేవాడని త్విషా సోదరుడు, ఇండియన్ ఆర్మీ మేజర్ హర్షిత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు అక్కడితో ఆగలేదు. గర్భం దాల్చిన ట్విషాని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా అబార్షన్ చేయించుకునేలా ఒత్తిడి తెచ్చారని, గర్భంలో ఉన్న బిడ్డపై లేనిపోని నిందలు వేస్తూ ఆమె శీలాన్ని శంకించారని కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. చనిపోయిన రోజు రాత్రి కూడా త్విషా తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ, తాను ఇక్కడ ఇరుక్కుపోయానని, భోపాల్ వదిలి నోయిడా వచ్చేస్తానని ఏడ్చింది.
కానీ, అంతలోనే భర్త గదిలోకి రావడంతో ఫోన్ కట్ అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె శ్వాస తీసుకోవడం లేదంటూ అత్తగారి నుండి ఫోన్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే త్విషా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పోస్ట్మార్టం నివేదిక ఈ కేసులో మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది.
త్విషా మరణం ఉరి వేసుకోవడం వల్లే జరిగిందని ప్రాథమికంగా తేలినా, ఆమె శరీరంపై మొద్దుబారిన వస్తువులతో దాడి చేయడం వల్ల ఏర్పడిన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా, ఉరి వేసుకోవడానికి ఉపయోగించారంటున్న బెల్ట్ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసును నీరుగార్చేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నిస్తున్నారని, చట్టం తెలిసిన రిటైర్డ్ జడ్జి కుటుంబం కావడంతో నిందితులను కాపాడుతున్నారని త్విషా కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. త్విషా మృతదేహానికి ఢిల్లీ ఎయిమ్స్లో రెండోసారి పోస్ట్మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భోపాల్లో ముఖ్యమంత్రి నివాసం వెలుపల బంధువులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. Also read: Salman Khan: సల్మాన్ ఖాన్ కన్నీళ్లు.. పదిహేను కోట్ల విరాళం ఇచ్చాడు మరి చట్టాన్ని రక్షించాల్సిన రిటైర్డ్ మహిళా జడ్జి, న్యాయవాది అయిన ఆమె భర్తే ఇప్పుడు ట్విషా మృతి కేసులో నిందితులుగా మారడం సమాజంలో కట్నపు వేధింపుల మహమ్మారి ఎంతలా వేళ్లూనుకుందో చెప్పడానికి ఒక నిదర్శనం.ట్విషా 2021 లో తెలుగులో ముగ్గురు మొనగాళ్లు అనే చిత్రంలో హీరోయిన్ గా చేసింది

