Rome : ఆఫ్ఘానిస్థాన్లో చిన్నారుల పోషకాహార లోపం మూడో వంతు ప్రావిన్సుల్లో అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్పీ) మంగళవారం హెచ్చరించింది.
నిధుల కొరత వల్ల ఆహార పంపిణీతో పాటు ఇతర సహాయ కార్యక్రమాలకు కోతలు పడుతున్నాయని, దీంతో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని తెలిపింది.ఈ సంక్షోభం వల్ల చిన్నారుల మరణాలు పెరుగుతున్నాయని, వాటిని అడ్డుకోవాలంటే వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆఫ్ఘానిస్థాన్లో డబ్ల్యూఎఫ్పీ దేశ డైరెక్టర్ జాన్ ఐలిఫ్ తెలిపారు. అయితే ఇప్పటికే చాలా మంది చిన్నారులకు ఆలస్యమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన సమయంలో అమెరికా దళాల ఉపసంహరణ తర్వాత నెలకొన్న పరిస్థితులతో పాటు, దశాబ్దాలుగా కొనసాగిన యుద్ధాలు, రాజకీయ అస్థిరత నుంచి ఆఫ్ఘానిస్థాన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని నివేదిక పేర్కొంది.ఐరాస మానవతా వ్యవహారాల కార్యాలయం ప్రతినిధి ఓల్గా చెరెవ్కో మాట్లాడుతూ, దేశంలోని మూడు వంతులకు పైగా ప్రాంతాల్లో ఈ ఏడాది చిన్నారుల్లో తీవ్ర పోషకాహార లోపం మరింత పెరిగిందని పోషకాహార నిపుణులు గుర్తించారని చెప్పారు. 'వేస్టింగ్'గా పిలిచే ఈ పరిస్థితిలో చిన్నారులు తమ ఎత్తుకు తగిన బరువు కోల్పోయి తీవ్ర పోషకాహార లోపానికి గురవుతారని, వారికి వెంటనే ప్రత్యేక పోషకాహార చికిత్స అవసరమని వివరించారు.చాలా మంది చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతోనే ఆరోగ్య కేంద్రాలకు చేరుతున్నారని, మరికొందరు అక్కడికి చేరకముందే ప్రాణాలు కోల్పోతున్నారని చెరెవ్కో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరులకు తెలిపారు.
నిలిచిన 13 వేల మందికి చికిత్స...
సహాయ నిధులు తగ్గడంతో 2025లో ఆఫ్ఘానిస్థాన్లో 142 ఆరోగ్య కేంద్రాలు మూతపడ్డాయని డబ్ల్యూఎఫ్పీ తెలిపింది. దీంతో 13 వేల మందికి పైగా చిన్నారులు పోషకాహార చికిత్సను కోల్పోయారని పేర్కొంది. ఏ దాత దేశం పేరును ప్రస్తావించకపోయినా, అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం విదేశీ సహాయ నిధుల్లో భారీ కోతలు విధించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.ఈ ఏడాది ఆఫ్ఘానిస్థాన్లో సుమారు 37 లక్షల మంది చిన్నారులు, 12 లక్షల మంది గర్భిణులు, పాలిచ్చే తల్లులు తీవ్ర పోషకాహార లోపానికి గురయ్యే అవకాశం ఉందని డబ్ల్యూఎఫ్పీ అంచనా వేసింది.దేశంలోని 12 ప్రావిన్సుల్లో చిన్నారుల తీవ్ర పోషకాహార లోపం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని తెలిపింది. యుద్ధాలు, నిరుద్యోగం, ఆహార ధరల పెరుగుదల, వ్యాధుల వ్యాప్తి, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు, మానవతా సహాయ నిధుల తగ్గుదల కలిసి ఈ పరిస్థితికి కారణమయ్యాయని వివరించింది.
యుద్ధాలతో సరఫరాలకు అంతరాయం...
మధ్యప్రాచ్య ఘర్షణలు, ఇరాన్ యుద్ధం ప్రభావంతో పాటు, పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ సరిహద్దు తొమ్మిది నెలలుగా మూసివేయడం వల్ల పోషకాహార ఉత్పత్తుల సరఫరా దెబ్బతిన్నట్లు డబ్ల్యూఎఫ్పీ తెలిపింది. ఫలితంగా దాదాపు పది లక్షల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్న మహిళలు, చిన్నారులు ఐదు నెలలుగా అత్యవసర పోషకాహార సేవలకు దూరమయ్యారని వెల్లడించింది.జూలై నుంచి అక్టోబర్ వరకు పోషకాహార లోపం అత్యధికంగా ఉండే కాలమని, అయినప్పటికీ నిధుల కొరత వల్ల ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కరవు నివారణ కోసం చేపట్టే ఆహార పంపిణీని నిలిపివేయాల్సి వస్తోందని తెలిపింది.రాబోయే ఆరు నెలలకు అత్యవసరంగా 54 కోట్ల డాలర్లు అవసరమని డబ్ల్యూఎఫ్పీ వెల్లడించింది.
నిధుల కొరత తీవ్ర ప్రభావం...
ఆఫ్ఘానిస్థాన్లో పనిచేస్తున్న మానవతా సంస్థలు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జాన్ ఐలిఫ్ మాట్లాడుతూ, నిధుల కోతలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న ప్రతి నలుగురు చిన్నారుల్లో ముగ్గురిని వెనక్కి పంపాల్సి వస్తోందని చెప్పారు.2022తో పోలిస్తే ఆహార సహాయానికి అందుతున్న నిధులు దాదాపు 59 శాతం తగ్గిపోయాయని, అదే సమయంలో అవసరాలు గణనీయంగా పెరిగాయని డబ్ల్యూఎఫ్పీ తాజా నివేదిక తెలిపింది.జూన్లో అమెరికా డబ్ల్యూఎఫ్పీకి 80 కోట్ల డాలర్ల సహాయం ప్రకటించింది. దీంతో కనీసం 37 దేశాల్లో 3.8 కోట్ల మందికి పైగా ప్రజలకు సహాయం అందించగలమని సంస్థ వెల్లడించింది.ఆఫ్ఘానిస్థాన్ కోసం కోరిన 171 కోట్ల డాలర్ల మానవతా సహాయంలో ఇప్పటివరకు కేవలం 26 శాతానికి కొద్దిగా మించిన నిధులే అందాయని చెరెవ్కో తెలిపారు. పోషకాహార లోపంతో పాటు ఇతర సూచీలు కూడా దిగజారుతున్న వేళ ఇది తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.

