ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ గురువారం ధిక్కార స్వరంతో స్పందించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ అణు, క్షిపణి సామర్థ్యాలను కాపాడుతామని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైమానిక దాడులు, విస్తృత ఒప్పందం ద్వారా వాటిని కుదించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.రాష్ట్ర టెలివిజన్ ద్వారా చదివిన ప్రకటనలో ఖమేనీ మాట్లాడుతూ, అమెరికన్లు పర్షియన్ గల్ఫ్లో ఉండాల్సిన చోటు "ఆ సముద్రపు అడుగునే" అని అన్నారు. ఈ ప్రాంత చరిత్రలో "కొత్త అధ్యాయం" మొదలైందని పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభ దాడుల్లో తన తండ్రి మరణించిన తర్వాత సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ఖమేనీ ఇప్పటివరకు ప్రజల్లో కనిపించలేదు.
క్రూడాయిల్ ధర పెరగడంతో...ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. అమెరికా నౌకాదళ ఆంక్షలతో చమురు ట్యాంకర్లు సముద్రంలోకి వెళ్లలేకపోతున్నాయన్న సమాచారం ఉంది. ఇదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ఒత్తిడి పెరిగింది. ప్రపంచ ముడి చమురులో ఐదో వంతు రవాణా జరిగే హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగుతోంది. గురువారం గ్లోబల్ బెంచ్మార్క్ అయిన క్రూడ్ బ్యారెల్ ధర 126 డాలర్ల వరకు ఎగసింది.ఈ పరిస్థితి ట్రంప్పై ఒత్తిడి పెంచుతోంది. అమెరికా మిత్ర దేశాలు తమ చమురు, వాయువును రవాణా చేసుకునే ఈ మార్గాన్ని తిరిగి తెరవాలని ఆయన కొత్త ప్రణాళికను పరిశీలిస్తున్నారు. ఆ ప్రణాళిక ప్రకారం ఇరాన్ నౌకాశ్రయాలపై ఆంక్షలు కొనసాగుతాయి. శక్తి రవాణా అడ్డుకునే ఇరాన్ చర్యలకు మిత్రదేశాలతో కలిసి అధిక ఖర్చు మోపాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.ఇతర దేశాల మద్దతు...మంగళవారం పంపిన సందేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబారులకు సూచనలు జారీ చేసింది. బెలారస్, చైనా, క్యూబా, రష్యా మినహా ఇతర దేశాల మద్దతు కోరాలని తెలిపింది. "సముద్ర స్వేచ్ఛ నిర్మాణం" ఏర్పాటుకు సహకరించాలని కోరింది. ఈ సందేశం ప్రతిని ది అసోసియేట్ ప్రెస్ కు అందింది. ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ, పెంటగాన్ సెంట్రల్ కమాండ్ నాయకత్వం వహిస్తున్నాయి. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛగా, సురక్షితంగా నావిగేషన్ చేయడం ప్రతి దేశ హక్కు అని పేర్కొన్నాయి. అదే సమయంలో ట్రంప్ యూరప్లోని మిత్ర దేశాల్లో అమెరికా సైనిక బలగాల ఉనికిపై కూడా సమీక్ష చేస్తున్నట్టు తెలిపారు. జర్మనీలో సైనిక బలగాలను తగ్గించే అంశంపై సమీక్ష చేస్తున్నట్టు ప్రకటించిన మరుసటి రోజే, ఇటలీ, స్పెయిన్ నుంచి కూడా బలగాలను ఉపసంహరించాలా అని ప్రశ్నించగా "ఎందుకు కాదు" అని సమాధానమిచ్చారు. ఇరాన్ కార్యకలాపాల కోసం స్థావరాల వినియోగంపై ఈ దేశాలతో అమెరికాకు విభేదాలు ఉన్నట్టు సమాచారం.జలసంధి మూసివేతతో ...అమెరికా ఆంక్షలతో ఇప్పటివరకు 44 వాణిజ్య నౌకలను వెనక్కు మళ్లించినట్టు సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ చమురు విక్రయాలు ఆగిపోవడం వల్ల ఆదాయం దెబ్బతింటోంది. నిల్వ సదుపాయాలు లేక ఉత్పత్తిని నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చని అంచనా.ఇరాన్ తాజాగా అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేయాలని ప్రతిపాదించింది. అణ్వాయుధ సామర్థ్యం దక్కకుండా చేయడమే యుద్ధానికి ప్రధాన కారణమని ట్రంప్ అన్నారు. అయితే తమ కార్యక్రమం శాంతియుతమేనని ఇరాన్ ఎప్పటి నుంచో చెబుతోంది. అయినప్పటికీ యురేనియంను 60 శాతం స్థాయికి శుద్ధి చేసినట్టు సమాచారం.పాకిస్థాన్ పరోక్ష చర్చలను సులభతరం చేస్తున్నట్టు తెలిపింది. ఇరు దేశాలు నేరుగా మాట్లాడితే సమస్యలు తగ్గవచ్చని విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అండ్రాబీ పేర్కొన్నారు.పర్షియన్ గల్ఫ్ దినోత్సవం సందర్భంగా ఖమేనీ మాట్లాడుతూ అణు, క్షిపణి కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని స్పష్టం చేశారు. "దేశీయ గౌరవానికి అవి భాగం" అని అన్నారు. అమెరికాను "గ్రేట్ శైతాన్"గా అభివర్ణించారు.హోర్ముజ్ జలసంధి మూసివేత...ఇరాన్, ఒమాన్ భూభాగ జలాల్లో ఉన్న ఈ మార్గంపై తమ నియంత్రణ కొనసాగుతుందని ఖమేనీ సంకేతం ఇచ్చారు. ఈ మార్గం గుండా వెళ్లే నౌకల నుంచి రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్రపంచం ఈ మార్గాన్ని అంతర్జాతీయ జలమార్గంగా చూస్తోంది. టోల్ వసూలు చేయడాన్ని గల్ఫ్ అరబ్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనిని సముద్ర దోపిడీతో సమానంగా పేర్కొంది. జనవరిలో జరిగిన నిరసనల కేసులో 21 ఏళ్ల సాసన్ ఆజద్వర్ను ఉరితీశామని ఇరాన్ న్యాయ వ్యవస్థకు చెందిన మిజాన్ సంస్థ తెలిపింది. పోలీసులపై దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి విభేదాలపై కఠిన చర్యలు పెరిగాయని హక్కుల సంస్థలు చెబుతున్నాయి.ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగాధిపతి వోల్కర్ టర్క్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కనీసం 21 మందిని ఉరి తీశారని చెప్పారు. మూసివేసిన విచారణల్లో నిందితులకు వాదనలు వినిపించే అవకాశం లేదని సంస్థలు హెచ్చరిస్తున్నాయి.దక్షిణ లెబనాన్లో కాల్పులు...ఇజ్రాయెల్, లెబనాన్కు చెందిన ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన పోరులో ఒక సైనికుడు మరణించాడని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి మృతుల సంఖ్య 17కు చేరింది. ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగాయి. హిజ్బుల్లా వినియోగిస్తున్న సైనిక నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకారం ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు కలిపి 9 మంది మరణించారు. ఇదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ శాఖ తమ పౌరులు ఇరాన్, లెబనాన్, ఇరాక్ దేశాలకు ప్రయాణించవద్దని నిషేధం విధించింది. ఇప్పటికే అక్కడ ఉన్న వారు తిరిగి రావాలని సూచించింది.

