రాయలసీమ దేశ రక్షణ రంగంలోనూ ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ డిఫెన్స్ ప్రాజెక్టును ఏరో నాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ-డీఆర్డీఓ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొననున్నారు. 15,803 కోట్ల రూపాయలతో, 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ అని చెబుతున్నారు. ఇందులో స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అత్యాధునిక ఏవియానిక్స్ వంటి హంగులతో యుద్ద విమానాలను అభివృద్ధి చేయనున్నారు. యుద్ద విమానాలను పుట్టపర్తిలోనే అభివృద్ధి చేయడంతోపాటు... టెస్టింగ్ కూడా చేపట్టేలా ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా.
అనుబంధంగా వచ్చే...అలాగే ఈ ప్రధాన ప్రాజెక్టుకు అనుబంధంగా వచ్చే ఇతర యూనిట్ల ద్వారా రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 400 ఎకరాలు కేటాయించింది. వీటితో పాటు కర్నూలు జిల్లాలో నిర్మిస్తోన్న 'డ్రోన్ సిటీ' ద్వారా భారతదేశంలోనే అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టమ్ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఎఎంసీఏ ప్రాజెక్టుతో పాటు డిఫెన్స్ రంగానికి చెందిన 4 ప్రాజెక్టులు, 8 డ్రోన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరగనుంది. ఈ పన్నెండు ప్రాజెక్టుల ద్వారా రూ.4145 కోట్ల పెట్టుబడులు, 6,071 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. వీటిల్లో మడకశిరలో రెండు ప్రాజెక్టులు, దొనకొండ, నెల్లూరుల్లో ఒక్కో ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. మిగిలిన 8 డ్రోన్ ప్రాజెక్టులు కర్నూలు జిల్లాలోని డ్రోన్ సిటీలో నిర్మాణాలు చేపట్టనున్నాయి. సీఎం పర్యటన షెడ్యూల్...ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉదయం 8:15 గంటలకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 9:45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 10:15 గంటలకు శంకుస్థాపన కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు. ఉదయం 10:15 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపనతో పాటు వివిధ డిఫెన్స్, డ్రోన్ ప్రాజెక్టులకు భూమి పూజను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:20 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు.

