అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో భారతీరాజా బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యతో భారతీ రాజా బాధపడుతూ కన్నుమూశారు.
దీంతో తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. భారతీ రాజా యూనివర్సిటీలో ఎందరో దిగ్గజ నటులు అక్షరాలు దిద్దారు. నటులుగా ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నారు. అనేక సినిమాలు కేవలం భారతీరాజాకు మాత్రమే కాకుండా ఆయన సినిమాలో నటించిన వారందరికీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. తెలుగులో ఆయన తీసిన సీతాకోక చిలుక మూవీ యువతను ఉర్రూతలూగించింది.
ఎందరో నటులకు హిట్ లు...
రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి నటులతోనూ సూపర్ హిట్ సినిమాలు అందించారు. భారతీ రాజా సినిమాల్లో కేవలం దర్శకత్వం మాత్రమే కాదు... సంగీతం కూడా ఆకట్టుకునే విధంగా ఉండేది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తమిళ సినీ చరిత్రలో గ్రామీణ కథలకు కొత్త దిశ చూపిన దర్శకుడు భారతీరాజా ముద్ర పడ్డారు. వెండితెరపై పల్లె అందాలను అద్భుతంగా ఆవిష్కరించిన సినీ దిగ్గజంగా పేరు పొందారు. భారతీరాజా దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకుంది
1977లో విడుదలయిన...
నందమూరి బాలకృష్ణ నటించిన మంగమ్మగారి మనవడు చిత్రానికి భారతీ రాజా కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ప్లేను అందించారు. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన భారతీరాజా 1977లో విడుదలైన "16 వయతినిలే" చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి చలన చిత్ర రంగంలో సంచలనం సృష్టించారు.తమిళ సినిమాల్లో గ్రామీణ జీవన విధానాన్ని సహజత్వంతో చూపించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అందుకే ఆయనను "దర్శక ఇమయం"గా అభిమానులు పిలుస్తారు. సిగప్పు రోజక్కల్, కిజక్కే పోగుం రైల్, అలైగల్ ఓయ్వతిల్లై, ముదల్ మరియాదై, కరుత్తమ్మ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించారు.
అనేక మంది నటులకు...
తమిళంతో పాటు తెలుగు,కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు రూపొందించారు. తన సినిమాల ద్వారా రాధా, రాధిక, రేవతి, కార్తీక్ తదితర పలువురు నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. - ఆరు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు, పలు రాష్ట్ర స్థాయి అవార్డులు భారతీ రాజా అందుకున్నారు. భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో భారతీరాజా సత్కరించింది. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ ఆయుధ ఎళుత్తు, పాండియా నాడు, తిరుచిత్రంబలం వంటి చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా తమిళ సినీ పరిశ్రమలో తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను అలరించిన భారతీరాజా భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.

