Ceuta : మొరాకో నుంచి స్పెయిన్లోని సియుటా భూభాగానికి చేరేందుకు వేలాది మంది ఒకేసారి ప్రయత్నించిన సమయంలో 17 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. అయితే ఆమె ఎనిమిదేళ్ల తమ్ముడు మధ్యధరా సముద్రంలో మునిగి చనిపోయాడు.
ఆ గందరగోళంలో తల్లి కనిపించకుండా పోయింది.టాంజియర్కు చెందిన ఆ బాలిక కథ, ప్రస్తుతం సియుటాలో చిక్కుకుపోయిన 800 మందికిపైగా మైనర్ల పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. మెరుగైన జీవితం కోసం కుటుంబంతో కలిసి సముద్రం గుండా ఈదుతూ స్పెయిన్ భూభాగానికి చేరాలని ప్రయత్నించినట్లు ఆమె అసోసియేటెడ్ ప్రెస్ ఫొటో జర్నలిస్టుకు చెప్పింది. ఆమె మైనర్ కావడం, క్లిష్ట పరిస్థితిలో ఉండడంతో గుర్తింపును వెల్లడించలేదు.స్పెయిన్ పోలీసులు తన ఎనిమిదేళ్ల తమ్ముడి మృతదేహాన్ని సముద్రం నుంచి బయటకు తీసుకువచ్చిన దృశ్యం తాను చూసినట్లు ఆమె తెలిపింది. తాను ఒడ్డుకు చేరినా తల్లితో విడిపోయానని, గత నాలుగు రోజులుగా ఒంటరిగానే ఉంటున్నానని చెప్పింది. స్థానికులు కొందరు ఆహారం, బట్టలు ఇచ్చారని, ఓ మహిళ ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించిందని తెలిపింది. తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలోని యువత కేంద్రానికి వెళ్లినా అక్కడ స్థలం లేకపోయిందని వివరించింది."చనిపోయిన వారి మీదుగానే కొందరు నడుస్తూ వెళ్లడం చూశాను. ఇప్పుడు మేమంతా వీధుల్లో అడుక్కునే పిల్లలమయ్యాం" అని ఆమె అనువాదకుడి ద్వారా చెప్పింది.
860 మంది మైనర్లు ఇంకా సియుటాలోనే...స్థానిక అధికారుల వివరాల ప్రకారం సోమవారం నాటికి సియుటాలో 860 మంది మైనర్లు మిగిలి ఉన్నారు. వీరిలో చాలామంది ఆహారం కోసం అడుగుతున్నట్లు ఏపీ ప్రతినిధులు గుర్తించారు.మొత్తం సుమారు 60 వేల మంది సరిహద్దు దాటేందుకు ప్రయత్నించగా, వారిలో ఎక్కువ మందిని తిరిగి మొరాకోకు పంపించారు. ప్రస్తుతం 3 వేల నుంచి 5 వేల మంది వరకు మాత్రమే సియుటాలో ఉన్నారు. సరిహద్దు దాటే ప్రయత్నంలో 72 మంది మరణించినట్లు స్పెయిన్ అధికారులు ధ్రువీకరించారు. వీరిలో ఎక్కువ మంది సముద్రంలో మునిగిపోయారు. మరో 11 మంది మరణించినట్లు మొరాకో ప్రకటించినా, ఆ సంఖ్యను స్పెయిన్ గణాంకాల్లో చేర్చలేదు.మైనర్లకు రక్షణ కల్పించాల్సిందే...స్పెయిన్ చట్టాల ప్రకారం వయోజన వలసదారులు ఆశ్రయం కోరే అవకాశం ఉంది. దరఖాస్తు తిరస్కరిస్తే వారిని దేశం నుంచి పంపించే ప్రక్రియ మొదలవుతుంది. మొరాకో పౌరులకు మానవతా పరిరక్షణ లభించడం మాత్రం చాలా అరుదు.కానీ పెద్దలతో లేని మైనర్లకు రక్షణ కల్పించి, వారి సంరక్షణ బాధ్యత స్పెయిన్ అధికారులదే.ఏపీ ప్రతినిధి గమనించిన ఘటనలో, ఏడుస్తూ తనను మొరాకోకు పంపొద్దని వేడుకున్న ఓ మొరాకో బాలుడిని స్పెయిన్ సైనికులు సరిహద్దు వరకు తీసుకెళ్లారు. స్థానికులు అతను మైనర్ అని అభ్యంతరం చెప్పడంతో పాటు మీడియా ఉండటంతో, సైన్యాధికారి అతడిని తిరిగి పంపించే చర్య నిలిపివేసి స్పెయిన్ సివిల్ గార్డ్కు అప్పగించారు.మొరాకోకు చెందిన పెద్దల్లో ఎక్కువ మంది స్వచ్ఛందంగా తిరిగి వెళ్లారు. మరికొందరిని స్పెయిన్ పోలీసులు వెనక్కి పంపించారు. ఇంకా సియుటాలో ఉన్నవారిలో యుద్ధంతో నష్టపోయిన సూడాన్ నుంచి వచ్చినవారు, గాజా ప్రాంతానికి చెందిన పాలస్తీనీయులు, అఫ్గాన్లు, మరికొన్ని ఆఫ్రికా దేశాల పౌరులు కూడా ఉన్నారు.600 మంది సామర్థ్యమున్న నగర వలసదారుల కేంద్రం పూర్తిగా నిండిపోయింది. వలసదారుల్లో ఆహార కొరత ఉందని ఏపీ ప్రతినిధులు వెల్లడించారు."ఆకలి, దాహం, అలసటతో చివరకు వీళ్లే స్వచ్ఛందంగా మొరాకోకు వెళ్లిపోతారని అధికారులు భావిస్తున్నారు" అని స్థానిక వలసదారుల హక్కుల కార్యకర్త రామ్సెస్ మొహమ్మద్ అజుమిక్ తెలిపారు.చాలామంది వలసదారులు సియుటా సముద్రతీరం, కొండ ప్రాంతాల్లోనే తలదాచుకుంటున్నారు. సముద్రానికి ఆవల కనిపిస్తున్న యూరప్ ప్రధాన భూభాగమే వారి అంతిమ లక్ష్యం.

