తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేస్తున్నారు. రెండేళ్లవుతున్నా ఏ మాత్రం నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యలపైనా దృష్టి పెట్టని ఎమ్మెల్యేలను గుర్తించారని తెలిసింది.
ఇప్పటికే పలు దఫాలుగా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారిలో మార్పు రావడం లేదని భావించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వారిని దూరం పెట్టేందుకే నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇక హెచ్చరికలు వంటివి ఏమీ లేకుండా ఈ మూడేళ్ల కాలాన్ని అలా కానిచ్చి, ఎన్నికల సమయానికి వారిపై వేటు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు చంద్రబాబు కఠిన నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో...కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో 2024 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. వారిలో దాదాపు నలభై మంది పనితీరును బాగాలేదని గుర్తించారు. సుమారు 135 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో దాదాపు నలభై మంది పనితీరు బాగాలేదని కొంత కాలం క్రితం చంద్రబాబు గుర్తించారు. పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు వివిధ నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు చంద్రబాబుకు అందిన నివేదికల మేరకు ఈ నలభై మందికి ఒకటికి రెండుసార్లు వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మెరుగు పర్చుకోకుంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మిగిలి పోతారని కూడా చంద్రబాబు పలు దఫాలు హెచ్చరించారు. అయినా వారిలో ఏ మాత్రం మార్పు రాలేదని తాజాగా అందిన నివేదికలను బట్టి తెలియడంతో ఇక వారిని పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలతో...పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమై వారి ప్రోగ్రెస్ రిపోర్టును కూడా వారి చేతుల్లోనే ఉంచారు. కానీ ఏ మాత్రం వారి పనితీరులో పురోగతి లేదని తెలియడంతో ఒకింత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, పింఛను, ఇతర సంక్షేమ పథకాలను లబ్దిదారులకు పంపిణీ చేసే సమయంలో యాక్టివ్ గా లేకపోవడంతో పాటు మద్యం, ఇసుక వంటి ఆరోపణలు రావడం, స్థానిక వైసీపీ నేతలతో కుమ్మక్కు కావడం వంటి వాటిలో ఈ ఎమ్మెల్యేలు భాగస్వామ్యులుగా ఉన్నారని తేలింది. దీంతో ఈ మూడేళ్ల కాలం కళ్లుమూసుకుంటే తర్వాత వీరికి ప్రత్యామ్నాయంగా మరొకరిని ఆ నియోజకవర్గానికి ఎంపిక చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం మీద చంద్రబాబు ఇక పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలను పట్టించుకోకూడదని, అక్కడ ప్రత్యామ్నాయ నేతలను చూడాలని భావిస్తున్నట్లు తెలిసింది.

