ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి మాత్రం సంక్షేమం విషయంలో ఒక అడుగు ముందే ఉండాలని భావిస్తున్నారు. వైఎస్ జగన్ ను మించి సంక్షేమంలోనూ తాను పెద్ద అని నిరూపించుకోవాలని అనుకుంటున్నారు.
అందుకే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాలను ఒక క్యాలెండర్ ప్రకారం అమలు చేస్తున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా అది జగన్ కు అడ్వాంటేజీ అవుతుందని భావించిన చంద్రబాబు అప్పో సొప్పో చేసి చెప్పినట్లుగానే లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తున్నారు. చంద్రబాబు గత మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంక్షేమం విషయంలో ఇంత సీరియస్ గా లేరని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.
సంక్షేమ పథకాల విషయంలో...
నెలవారీ పింఛన్లు కావచ్చు... తల్లికి వందనం పథకం కావచ్చు. 'మత్య్సకారుల సేవలో పథకం కింద చేపల వేట విరామం సమయంలో ఇచ్చే ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేల రూపాయలు అవ్వొచ్చు.. అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు అయినా... సకాలంలో ఇస్తూ సంక్షేమంలో తాను ఫస్ట్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పరిశ్రమల స్థాపన విషయంలోనూ చంద్రబాబు తన మార్క్ ను చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన రెండేళ్లలోనే అనేక పరిశ్రమలను చంద్రబాబు ఏపీకి తీసుకు వచ్చారు. తాము అగ్రిమెంట్ చేసిన వాటినే గ్రౌండ్ చేస్తున్నారని వైసీపీ చెప్పుకున్నా.. చంద్రబాబు హయాంలోనే వాటికి ఒక రూపు రేఖలు వస్తుండటం, కేంద్రప్రభుత్వంతో సయోధ్యతతో ఉండి పరిశ్రమల ఏర్పాటులో ఇతర రాష్ట్రాలకు ధీటుగా స్పందించడం ఒకరకంగా ప్లస్ అవుతున్నట్లే కనిపిస్తుంది.
బిల్లు చెల్లింపులు...
ఇక తాజాగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉన్న పాత బకాయీలను కూడా ప్రభుత్వం చెల్లించింది. ఆరోగ్య శ్రీ సేవలను పేదలకు అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులలో మార్గం సుగమమయింది. ఎన్టీఆ్ వైద్య సేవా ట్రస్ట్ ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపు చేయడాన్ని ప్రారంభించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.919.13 కోట్లు చెల్లించారు. బిల్ డిస్కౌంటింగ్ విధానంలో వేగంగా చెల్లింపులు చేస్తున్నారు. 785 ఆస్పత్రులు బిల్ డిస్కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా, ట్రస్ట్ ఆస్పత్రులు, పీఎఫ్ సి మధ్య ట్రైపార్టీ ఒప్పందాలు, బిల్ డిస్కౌంటింగ్ పోర్టల్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ వంటివి కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం ప్రభుత్వం 5,556 కోట్ల చెల్లింపులు జరపడం అంటే చంద్రబాబు సర్కార్ సంక్షేమం పట్ల ఎంత వేగంగా అడుగులు వేస్తుందో వేరే చెప్పాల్సిన పనిలేదు.

